వైఎస్ జగన్ తుగ్లక్, రాజధాని రాష్ట్ర సమస్య కాదు, లోక్సభలో గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీల అభ్యంతరం
రాజధాని రాష్ట్ర సమస్య కాదు జాతి సమస్య అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి పేరు చెప్పి.. వికేంద్రీకరణ అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగించారు. అయితే మూడు రాజధానులపై ప్రసంగించడం, సీఎం జగన్ను దూషించడంపై వైసీపీ సభ్యులు గల్లా జయదేవ్ ప్రసందానికి అభ్యంతరం తెలిపారు.
అప్పుడు అంగీకరించి..
2014లో అప్పటి విపక్ష నేత అమరావతి రాజధాని ఏర్పాటుకు అంగీకరించారని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిని మార్చబోమని మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పారని విమర్శించారు. జగన్ను కొన్ని పత్రికలు తుగ్లక్ అని అభివర్ణించాయని సభలో ప్రస్తావించగా.. వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రొటెం స్పీకర్ కూడా కల్పించుకొని తీర్మానంపై మాట్లాడాలని సూచించారు. పదే పదే చెప్పినా వినిపించుకోకపోవడంతో 7 నిమిషాల తర్వాత మరో నేతకు మైక్ ఇచ్చారు.
ఏ రాష్ట్రానికి లేవే..?
మూడు రాజధానుల ఏర్పాటు పిచ్చి చర్య అని గల్లా జయదేవ్ అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చేస్తే భూములు ఉన్నవారు 9 సార్లు పన్ను కట్టాల్సి వస్తోందని చెప్పారు. అభివృద్ధి పేరుతో వికేంద్రీకరణ చేయడం సరికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో 2015లో కేంద్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా ప్రకటించిందని తెలిపారు. కానీ వైసీపీ మాత్రం రాజధానిని మార్చేందుకు మొగ్గు చూపుతుందని గుర్తుచేశారు.
అసెంబ్లీ తీర్మానంపై కలుగజేసుకోం..
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చదివి వినిపించారు గల్లా జయదేవ్. అయితే ప్రొటెం స్పీకర్ పదే పదే కల్పించుకొని.. తీర్మానంపై మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ చేసిన తీర్మానంపై పార్లమెంట్ కలుగజేసుకొదని స్పష్టంచేశారు. అలా చేస్తే అసెంబ్లీని తక్కువ చేయడమే అవుతోందన్నారు. తాను తీర్మానాన్ని తప్పుపట్టడం లేదని చెబుతూనే.. అదే అంశంపై గల్లా జయదేవ్ మాట్లాడారు.