తెలంగాణానే వచ్చింది, హోదా రాదా?: బాబును ఏకేసిన జగన్
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పిన నాయకులు.. ఎన్నికల తర్వాత మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం కర్నూలులో నిర్వహించిన యువభేరీలో ప్రసంగించారు.
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్లు తెచ్చుకున్నారు.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను మనం ఎందుకు సాధించుకోలేం? అని జగన్ ప్రశ్నించారు. అందరం కలిసి పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ఒక్కడితో సాధ్యం కాదని, అందరూ కలిసి పోరాడితేనే హోదా సాధ్యమవుతుందని జగన్ అన్నారు.
నాయకుడి గురించి చెబితే ప్రజలు కాలరేగుసుకోవాలని, ఈ నాయకులు మాత్రం కాలరుపట్టుకునేలా చేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఒకరు హోదా పదేళ్లు కావాలంటే, మరొకరు 15ఏళ్లే కావాలని అన్నారని చెప్పారు. చంద్రబాబు ఒకడగు ముందుకేసి హోదాతోపాటు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు.
బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారం చేశారని మండిపడ్డారు. రైతులు, ఆడవాళ్ల సరిపోక, బీదవాళ్ల మీద కూడా పడ్డారని అన్నారు. డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని కూడా అన్నారని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలంటూ పిల్లలని సైతం వదిలిపెట్టలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసం కళ్లెదుటే కనిపిస్తోందని అన్నారు.
ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు, ఉద్యోగాలు లభిస్తాయని, హోదాతో కేంద్రం ఇచ్చే నిధుల్లో 90శాతం గ్రాంటు ఇస్తారని వివరించారు. హోదా లేకుంటే గ్రాంటుగా ఇచ్చే నిధులు 30శాతమే ఉంటుందని అన్నారు. హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇస్తారని అన్నారు. 16సార్లు బాబు విదేశాలకు వెళ్లారని, ప్రైవేటు జెట్లలోనే పోతారని అన్నారు. బాబు, జగన్ మోహాలు చూసి రారని, రాయితీలుంటేనే పరిశ్రమలు వస్తాయని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఇది అర్దం కావడం లేదని అన్నారు.