చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దారిలో జగన్, అన్నీ షిఫ్ట్: వ్యూహాత్మకంగా అక్కడే ఆఫీస్, ఇల్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14వతేదీన వారి కుటుంబం గృహప్రవేశం చేసే అవకాశముంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం ఉంది.
వైయస్ జగన్ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో ఉండనున్నాయి. ఈ రెండు నిర్మాణాలు ఎకరం 90 సెంట్లలో తుది రూపుదిద్దుకుంటున్నాయి. విభజన అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు.

చెన్నై - కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో
జగన్ నివాసం, కార్యాలయం ఒకేచోట ఉండనున్నాయి. జగన్ ఉండేచోటు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జగన్ పార్టీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతంలో వ్యూహాత్మకంగానే తన కార్యాలయం, నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది. జగన్ నివాసం చెన్నై - కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఉండనుంది.

లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి షిఫ్ట్
వైయస్ జగన్ ఈ నెల (జనవరి) 24 లేదా 25వ తేదీన కొత్త ఇంట్లోకి వస్తారని భావించారు. కానీ మరికొంత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం హైదరాబాదులోని లోటస్ పాండులో ఉంది. ప్రస్తుతం అధికార ప్రతినిధులు దాదాపు ఇక్కడి నుంచే మాట్లాడుతున్నారు. దీనిని కూడా తాడేపల్లికి షిఫ్ట్ చేస్తున్నారు. అధికార ప్రతినిధులు ఇక్కడి నుంచే మాట్లాడనున్నారు.

బస్సు యాత్రకు ప్లాన్
జగన్ ఇప్పటికే బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు యాభై నియోజకవర్గాలలో ఈ యాత్ర చేయనున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఏ నియోజకవర్గాలు కవర్ చేయలేదో ఆ నియోజకవర్గాలు ఉండనున్నాయి. జగన్ బస్సు యాత్ర త్వరలో తేలనుంది. అలాగే, పార్టీ లోకసభ, అసెంబ్లీ అభ్యర్థులను చాలా ముందే ప్రకటించాలని భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి రెండు నెలల ముందే ప్రకటించింది. అలాగే ప్రకటించాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications