కొత్త ట్విస్ట్, బాబుకు జగన్ రివర్స్ పంచ్: ప్రభుత్వాన్ని పడగొట్టగలరా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఎమ్మెల్యేల చేరికల అంశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గట్టి కౌంటర్ ఇచ్చి, ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజేశారు.
కొద్ది రోజులుగా ఏపీలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. వైసిపికి చెందిన ఆరు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని, వీరు నాలుగైదు జిల్లాలకు చెందిన వారని వార్తలు వచ్చాయి. వారు చంద్రబాబుతో టచ్లో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి.
నేటి మరిన్ని తాజా వార్తలు
ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయంలో ఒకింత గందరగోళం ఏర్పడింది. బుధవారం జగన్ టిడిపికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తద్వారా ఎమ్మెల్యేల చేరిక విషయంలో టిడిపికి గట్టి ఝలక్ ఇచ్చారు. అంతేకాదు, టిడిపిలోకి వెళ్లేందుకు ఎవరు మొగ్గు చూపరని, అసలు టిడిపి ఎమ్మెల్యేలే తనతో టచ్లో ఉన్నారని జగన్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరుతారనే వార్తలు కేవలం ప్రచారమేనని, తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు తెరాసలో చేరుతున్నందున, దానిని ఏపీలో పెద్దగా ప్రచారం చేయకుండా ఉంచేందుకు వైసిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారనే ప్రచారాన్ని టిడిపి తెరపైకి తీసుకొచ్చిందని వైసిపి ఆరోపిస్తోంది.
ఇప్పుడు జగన్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని, వారి పేర్లు చెప్పిన గంటలోనే బాబు సర్కార్ పడిపోతుందని వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు తన కేబినెట్ సమావేశంలో... మంత్రులకు ఏమని చెబుతారో తెలుసా?. ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదు? తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. చంద్రబాబు దగ్గర నల్ల ధనం ఉంది. కనుక ఏదైనా చేయగలడు. పైనున్న దేవుడు, ప్రజలు ఆయనకు మొట్టికాయలు వేసే సమయం వస్తుంది.
చంద్రబాబుకు ఒక చెడ్డ అలవాటు ఉంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారాలు చేస్తాడు. ఆయనకు కొద్దోగొప్పో మీడియా మద్దతు ఉంది కనుక, ఆ వార్తలు పేపర్లలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. దీని ప్రభావంతో మా ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా విలేకరుల సమావేశాలు నిర్వహించి చంద్రబాబును తిట్టడం జరుగుతోంది. బుద్ధి ఉన్నవాళ్లెవరైనా టిడిపిలో చేరతారా?' అని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications