వైసిపికి మోడీ షాక్!: అందుకేనని జగన్, టాప్ 10 హామీలు నెరవేర్చకుంటే..
న్యూఢిల్లీ: ఏపీలో బిజెపి - టిడిపిలు మిత్రపక్షంగా ఉన్నాయి కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదేమోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆరోపించారు. తమకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు.
టిడిపి మిత్రపక్షం కాబట్టి ఆయన తమకు నో చెప్పారేమోనని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, జగన్ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ)ని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఈసీ దృష్టికి పలు అంశాలను తీసుకు వెళ్లామని చెప్పారు.
ఎమ్మెల్యేల అనర్హత వేటు ఎలక్షన్ పరిధిలో ఉండాలని కోరినట్లు చెప్పారు. స్పీకర్ రూలింగ్ పార్టీ వ్యక్తే కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కాలయాపన చేస్తుంటారని చప్పారు. తాము పార్టీ ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేశామన్నారు. స్పీకర్ అధికారులు సీఈసీ చేతిలోనే ఉండాలన్నారు.

ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు స్పీకర్ నుంచి సీఈసీకి బదలీ కావాలన్నారు. అలాగే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామూలు చేయడంలేదన్నారు. టాప్ 10 హామీలు అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీని నిషేధించాలని తాము సీఈసీని కోరామని చెప్పారు.
తమ పార్టీ నుంచి టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తమకు ప్రధాని మోడీ అపాయింటుమెంట్ దొరకడం లేదని, టిడిపి మిత్రపక్షం కాబట్టి ఇవ్వడం లేదేమోనని, తాము చెప్పాలనుకున్నది మోడీకి లేఖ ద్వారా వివరిస్తామని చెప్పారు.
చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతితో యువతను మోసం చేశారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం గొంతు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయకపోవడమే కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం గొంతు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో ఎమ్మెల్యేను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల హామీలను పూర్తిగా మర్చిపోయారని చెప్పారు. రైతులకు 87వేల కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు ఇస్తానని, కనీసం వడ్డీ కూడా చెల్లించలేదన్నారు. డ్వాక్రా మహిళలకు పంగనామాలు పెట్టారన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా.. ఏపీతో పాటు హైదరాబాద్ నగరంలోను ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా చూడాలని సీఈసీని కోరినట్లు చెప్పారు. రెండు చోట్లా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహిస్తే కొంతమంది ఓటర్లు అక్కడ, ఇక్కడ కూడా ఓట్లు వేస్తున్నారని చెప్పారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications