75 శాతం ఉద్యోగాలు స్దానికులకే -కంపెనీలకు మరోసారి తేల్చి చెప్పేసిన జగన్
ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్ జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీనిపై చట్టం కూడా చేశారు. కానీ రాష్ట్రంలో పరిశ్రమలు అనుకున్న స్ధాయిలో రాకపోవడంతో ఈ హామీ అమలు కష్టంగానే ఉంది. కానీ తాజాగా పరిస్ధితులు క్రమంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో 75 శాతం స్ధానిక ఉద్యోగాల హామీ కచ్చితంగా అమలుకు జగన్ సిద్దమవుతున్నారు.
ఇవాళ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమల్ని ప్రారంభించిన సీఎం జగన్.. స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని పారిశ్రామిక వేత్తల్ని ఆదేశించినట్లు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుచేస్తామన్నారు. దాదాపు రూ. 1,400 కోట్లతో 15 నెలల్లో అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల సంస్ధ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన సీఎం జగన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇండస్ట్రీ కూడా అతి తక్కువ సమయంలో దాదాపు 800 - 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ , రెండో దశలో మరో వెయ్యి కోట్ల పెట్టుబడితో కంపెనీ పూర్తయ్యే సమయానికి 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే గొప్ప పరిశ్రమ మన ప్రాంతానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
Recommended Video
కంపెనీల ప్రతినిధులు అనుమతుల కోసం మన చుట్టూ తిరగకుండానే మన అధికారులే కంపెనీల చుట్టూ తిరిగి లైసెన్స్లు వారికిచ్చే విధంగా ఉత్సాహంగా పరిశ్రమల శాఖ పనిచేస్తుందని అమర్నాథ్ తెలిపారు. రానున్న రోజుల్లో పారిశ్రామికరంగంలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా నిలిపేందుకు సీఎం సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. సీఎం ఇక్కడున్న కొద్ది సమయంలోనే కంపెనీల వారికి ఒక మాట చెప్పారని,కంపెనీలకు ఏం కావాలన్నా మా ప్రభుత్వం నుంచి మేం అందిస్తాం కానీ మీరు మాత్రం స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారని మంత్రి తెలిపారు. సీఎం జగన్ చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు. స్ధానికులకు అన్ని రకాలుగా ప్రాధాన్యతను ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దానికి కంపెనీలు కూడా సహకరిస్తాయన్నారు.