జగన్ వెంట వైయస్ వివేకానంద: టిడిపిలో చేరిన ఆదికి షాక్!
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి సారించారు. పులివెందులలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ను ఓడించే పరిస్థితి చంద్రబాబు తెచ్చారని టిడిపి నేతలు అంటున్నారు. ఓ వైపు జగన్ కడప జిల్లాలో పర్యటిస్తుంటే ఆయనపై టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.
వైయస్ జగన్ తన సొంత జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో టిడిపి ప్లాన్గా ఆయన పైన విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు, జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ప్రభుత్వం పైన విరుచుకు పడ్డారు. ఇది మాటల ప్రభుత్వమని, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పులివెందులలో ప్రజాదర్బార్
జగన్ కడప జిల్లాలోని పులివెందులలో గల తన ఇంట్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. రేషన్ కార్డు పింఛన్, పక్కా ఇళ్లు కోరుతూ జగన్న కలిశారు.
ఫిర్యాదులు
పులివెందులలో 500 రేషన్ కార్డులను తొలగించారని ఆయనకు చెప్పారు. దీనిపై జగన్ స్పందించారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు.
ఏ వర్గానికి న్యాయం జరగట్లేదు
ఏ వర్గానికి చంద్రబాబు ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలకే కాలం సరిపోతోందన్నారు. చేతలు శూన్యమన్నారు. చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతోందన్నారు.
జనప్రవాహం
కాగా, జగన్ బుధవారం సాయంత్రం ముద్దనూరులో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇది తెలుసుకున్న జనం దారి పొడగునా ఆయనకు స్వాగతం పలికారు.
ఓపెన్ టాప్ జీపు
నాలుగు రోడ్ల కూడలి చేరుకోగానే ఓపెన్ టాప్ వాహనంపై జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డిలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
జగన్ వెంట వైయస్ వివేకా
ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు వైయస్ జగన్ తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిశాలకు సమీపంలోనే ఏర్పాటు చేసిన వైసిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
టిడిపిలో చేరిన ఆదికి షాకే
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డిలు టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా అబిమానులు తరలి వచ్చారు. ఇది ఎమ్మెల్యే ఆదికి షాకేనని వైసిపి అభిమానులు చెబుతున్నారు.