భూమిని విడగొట్టారు, మనసులను కాదు: జగన్
ఖమ్మం: భావోద్వేగాలతో రాజకీయాలు చేసి భూమినైతే విడగొట్టారు కానీ మనసుల్ని విడదీయలేరని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బుధవారం రాత్రి జరిగిన వైయస్సార్ జనభేరీ సభలో ఆయన ప్రసంగించారు. అన్యాయం జరిగితే తెలుగువారమంతా ఒక్కటవుతామని ఆయన అన్నారు.
రెండు ప్రాంతాల్లో తమ పార్టీ ఉంటుందని, రెండు ప్రాంతాల్లో తమ పార్టీ రాజన్న రాజ్యాన్ని తెస్తుందని ఆయన అన్నారు. ఓటేయాలని అడిగే ధైర్యం కాంగ్రెసుకు ఉందా, చంద్రన్న రాజ్యం తెస్తానని చంద్రబాబు చెప్పగలరా, ఆ ధైర్యం లేకనే భావోద్వేగాలతో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారని ఆయన అన్నారు. సమైక్యం అంటే తనకు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు కావాలని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లో నిజాయితీ అనే పదం టార్చిలైట్ వేసినా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వసనీయత అనే పదానికి అర్థం ఏమిటో తెలియని విధంగా వ్యవస్థ దిగజారిందని ఆయన అన్నారు.
ఇవాళ రాజకీయాలు చదరంగంగా తయారయ్యాయని, రాజకీయాల్లోంచి ఒక్క మనిషిని తప్పించడం కోసం దొంగ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదని ఆయన అన్నారు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందుకు అన్యాయంగా జైలు పాలు చేయడం కోసం వారి మనస్శాక్షి కూడా అడ్డుపడని స్థాయిలో రాజీయాలు చెడిపోయాయని ఆయన అన్నారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డిని జగన్ ఖమ్మం లోకసభ స్థానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణలో తన మొదటి ఎంపి అభ్యర్థి ఈ జిల్లా నుంచే అని ఆయన చెప్పారు. శ్రీనివాస రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications