నేరస్థుడితో కేంద్రమంత్రుల ఫోటోలా: పత్తిపాటి, 'విజయమ్మ భరిస్తున్నారు'
విజయవాడ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత ఎమ్మెల్యేలు బుద్ధి చెబుతున్నా మార్పు రావడం లేదని మంత్రి పత్తిపాటి పుల్లా రావు గురువారం నాడు ధ్వజమెత్తారు.
జగన్ తనకు అంటిన అవినీతి బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అధికార కాంక్షకు, అవినీతికి పరాకాష్ఠగా మారారని చెప్పారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు ఎమ్మెల్యేలు చెబుతున్నా ఆయనలో మార్పు రావడం లేదని, రాబోయే రోజుల్లో ప్రజలే అతనికి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. ఆర్థిక నేరస్థుడిగా గుర్తింపు పొందిన జగన్తో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోటోలు దిగడం సరికాదని పత్తిపాటి అన్నారు. ఆర్థిక నేరస్తుడు చెప్పే మాటలు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి మెజార్టీ ఉందని, తమకు వలసలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నారన్నారు.

చంద్రబాబును ఏం చేయలేరు: కేఈ
వైసిపి అధినేత జగన్ తీరు నచ్చకపోవడం వల్లే ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఉప ముఖ్యంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. గురువారం కర్నూలు జిల్లా ఇంఛార్జులతో ఆయన సమావేశమయ్యారు.
వైసిపిలో జగన్, విజయమ్మ తప్ప ఎవరూ మిగలరన్నారు. జగన్ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని చెప్పారు. విజయమ్మకు అన్నీ తెలిసినా మౌనంగా భరిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications