రోడ్డుపై కాల్చినా ఫర్వాలేదనిపిస్తుంది, నేనే అలా చెబితే: బాబుపై ఊగిపోయిన జగన్
2019 కురుక్షేత్రానికి నంద్యాల నాంది అని వైయస్ జగన్ అన్నారు. ఆయన నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.
నంద్యాల: 2019 కురుక్షేత్రానికి నంద్యాల నాంది అని వైయస్ జగన్ అన్నారు. ఆయన నంద్యాలలోని ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం ఆయన కుయుక్తులు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులను చూసినప్పుడు ఇలాంటి వాళ్లను నడిరోడ్డుపై కాల్చినా ఫర్వాలేదనిపిస్తోందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదని, ముఖ్య కంత్రి అన్నారు.
కేబినెట్ అంతా రోడ్డుపైకి
ఈ మధ్య కాలంలో నంద్యాల పట్టణంలో ఇంత హడావుడి ఎప్పుడు కనిపించలేదన్నారు. మంత్రులు, పెద్ద పెద్ద టిడిపి నాయకులు ఇక్కడే తిష్ట వేశారన్నారు. చివరకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ కూడా నంద్యాలలోనే తిరుగుతున్నారన్నారు. మనం పోటీలో ఉన్నాం కాబట్టే చంద్రబాబు, ఆయన కేబినెట్ నడి రోడ్డుపై కనిపిస్తోందన్నారు.
మనమే ఏకగ్రీవం అని ఉంటే
ఇదే నంద్యాలను మనం ఏకగ్రీవం అని ఉంటే ఇంత అభివృద్ధి చేసే వారా అని జగన్ ప్రశ్నించారు. ఒక్క పథకం వచ్చి ఉండేదా అన్నారు. ఈ అభివృద్ధి అంతా ఎందుకు జరుగుతుందో అందరికీ తెలుసునని చెప్పారు. ఎవరైతే చంద్రబాబుకు అమ్ముడు పోయారో, ఏ ఎమ్మెల్యేలను అయితే చంద్రబాబు కొన్నారో.. ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసునని చెప్పారు. ఉపఎన్నికలు అంటేనే చంద్రబాబు నిద్రలేచారని అందరికీ తెలుసునని చెప్పారు.
Recommended Video
ఇది ఉప ఎన్నిక మాత్రమే కాదు
ఈ రోజు నంద్యాలలో జరుగుతోంది ఉప ఎన్నిక మాత్రమే కాదన్నారు. ధర్మ యుద్ధం జరుగుతోందన్నారు. ఇది ధర్మానికి, అధర్మానికి మద్య జరుగుతోన్న యుద్ధమన్నారు. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతోన్న యుద్ధమన్నారు. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతోన్న యుద్ధమన్నారు.
2019 కురుక్షేత్రానికి నంద్యాల నాంది
మూడు సంవత్సరాలుగా చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలు, కుట్ర రాజకీయాలు, అవినీతిపై, అసమర్థ పాలనపై ఇవాళ ప్రజలు ఇచ్చే తీర్పుగా నంద్యాల ఉప ఎన్నిక ఉండబోతోందన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు దోచుకున్న లక్ష కోట్ల నుంచి వెదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు మనుషులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో జరిగే కురుక్షేత్ర మహాసభకు నాంది నంద్యాల ఉప ఎన్నిక అన్నారు.
ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర.. విష్ణు చక్రంలా తిప్పాలి
ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర అన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయుధాలు పట్టనవసరం లేదని, యుద్ధం చేయాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. వారి చూపుడు వేలుతో ఈవీఎం అనే బటన్ నొక్కుతూ, ఈవీఎం అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. ఏ మత గ్రంథం చదివినా ధర్మం, న్యాయం ఒక్కటే అన్నారు.
ఏ గ్రంథం చదివినా తప్పు తప్పే
ఈ సందర్భంగా జగన్ మహమ్మద్ ప్రవక్త కు చెందిన ఓ గాథను చెప్పారు. ప్రవక్త సత్య సందేశాలు సహించలేని కొందరు కుట్రదారులు సమావేశమవుతారని, హత్యకు కుట్ర పన్నుతారని చెప్పారు. కానీ ప్రవక్తను ఏం చేయలేకపోతారన్నారు. సత్యం ముందు అసత్యం ఓడిపోవాల్సిందేనని ఖురాన్ చెబుతోందన్నారు. ఖురాన్, బైబిల్, భగవద్గీత.. ఏది చదివినా తప్పు తప్పే అంటుందన్నారు.
సీఎం అంటామా, దొంగ అంటామా
సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్లిన రావణాసురుడిని మనం రాక్షసుడు అంటామని, మన డబ్బు ఎత్తుకు పోయిన వారిని దొంగ అంటామని, అలాగే వైసిపి నుంచి గెలిచి అమ్ముడుపోయిన వారిని, ఎత్తుకుపోయిన చంద్రబాబును దొంగ అందామా, సీఎం అందామా అని అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబును ఏమనాలన్నారు.
ఇదీ బాబు వైజం.. కథ చెప్పిన జగన్
ఇలాంటి చంద్రబాబు గురించి అప్పట్లో ఓ కథ చెప్పేవారని జగన్ అన్నారు. ఆ కథ ఏమంటే.. 'కోర్టులో ముద్దాయిని నిలబెట్టారు. జడ్జిగారు వచ్చి కూర్చున్నారు. జడ్జి గారు రాగానే బోనులో ఉన్న ముద్దాయి బోరున ఏడ్చాడు. సార్.. నేను తల్లి, తండ్రి లేని అనాథను సార్ అని మరింత బోరున ఏడ్చాడు. అప్పుడు జడ్జి ఈ నిందితుడు చేసిన తప్పేమిటని లాయర్లను ప్రశ్నించాడు. దానికి లాయర్.. సార్ ఇతను తల్లిదండ్రలను చంపేసి వచ్చాడు అని చెప్పాడు' ఇది చంద్రబాబు నైజమని జగన్ అన్నారు.
అలాంటి వారిని చంద్రబాబు అంటాం
అన్నీ నిజాలే చెప్పేవారిని సత్య హరిశ్చంద్రుడు అంటామని, కానీ జీవితంలో ఒక్క నిజం చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అంటామని జగన్ అన్నారు.