బాబు అలా చేస్తారు జాగ్రత్త?, నంద్యాల అభివృద్దిని నాకు వదిలేయండి: జగన్
'నంద్యాల అభివృద్దిని నాకు వదిలేయండి' అంటూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
నంద్యాల: గత ఐదు రోజులుగా నంద్యాలలోనే మకాం వేసిన వైసీపీ అధినేత జగన్.. ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ నంద్యాల గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐదో రోజు పర్యటనలో భాగంగా శ్రీనివాస సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ తీరును ఎండగడుతూ వైసీపీతోనే అభివృద్ది సాధ్యమనేలా జగన్ వ్యాఖ్యలు చేశారు. 'నంద్యాల అభివృద్దిని నాకు వదిలేయండి' అంటూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో సీఎం చంద్రబాబుపై జగన్ అవినీతి ఆరోపణలు చేశారు. మట్టి నుంచి మద్యం దాకా దోచేస్తున్నారని విరుచుకుపడ్డారు. నంద్యాలలో ప్రతీ కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు చెబుతుండటం అతి పెద్ద మోసమని విమర్శించారు.
చంద్రబాబు తరహాలో తన వద్ద పోలీసులు, పేపర్, ఛానెల్స్ బలం లేదని, తనకున్న ఆస్తి 'నాన్న గారు తీసుకొచ్చి సంక్షేమ పథకాలే' అని జగన్ వ్యాఖ్యానించారు. రేప్పొద్దున చంద్రబాబు మీవద్దకు వచ్చి జేబులోంచి రూ.500నోటు తీస్తారని, ఆ నోటు చేతిలో పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి తమకే ఓటేయమని అడుగుతారని ఎద్దేవా చేశారు.
అలాంటి ప్రలోభాలకు లొంగవద్దని నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. అధర్మానికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రార్థిస్తున్నట్లు జగన్ విన్నవించారు. పార్టీ గుర్తును మరింతగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలియనివాళ్లకు ఫ్యాన్ గుర్తు గురించి చెప్పాలని సూచించారు.
పాపానికి ఓటేయమని అడిగేది దెయ్యాలు మాత్రమేనని, దెయ్యాలతో లౌక్యంగా వ్యవహరించాలని జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications