పొత్తులపై దాడి వీరభద్ర రావు సంచలనం: జగన్ క్లాస్?
హైదరాబాద్: పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. పొత్తు అంశంపై దాడి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జగన్ ఆయనకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మిగిలిన పార్టీ నేతలను కూడా పొత్తు విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడవద్దని ఆదేశించారట.
దాడి నిన్న మాట్లాడుతూ.. రాబోయే కాలంలో యూపిఏకు మద్దతిస్తామని కడప ఉప ఎన్నికల సమయంలో వైయస్ జగన్ చెప్పారని, అప్పుడు ఆయన అరెస్టు కాలేదని, కాంగ్రెసు కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారని అన్నారు. అయితే జగన్ మద్దతిస్తామని చెప్పినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమించకుండా జగన్ను జైలులో పెట్టించిందని ఆరోపించారు. జైలుకు వెళ్లకముందు చెప్పిన మాటలకు మనుగడ లేదని, కాంగ్రెసుకు మద్దతివ్వమని దాడి చెప్పారు.
అయితే జైల్లో పెట్టారు కాబట్టి మాట మారుస్తున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే... ఊహాజనితాల సమాధానాలు చెప్పలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారన్నారు.
దాడి పై వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జగన్ ఆయనను మందలించినట్లుగా తెలుస్తోంది. టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఈ అంశంపై స్పందించారు. సోనియాను ఏమైనా అంటే జగన్ సహించరని, దాడిని మందలించడమే అందుకు నిదర్శనమని విజయవాడలో చెప్పారు.