జగన్ దోపిడీ మాటేంటి: దేవినేని, కేసీఆర్ సీఎం..: గాలి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం మండిపడ్డారు. జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. అప్పుల్లో ఉండి కూడా రుణమాఫీ చేస్తుంటే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ దోపిడీ పైన సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
గతంలో రుణమాఫీ వద్దన్న వారు ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాపాలకు వారసులు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, వైయస్ జగన్లే అన్నారు. ఎర్రచందనం వేలానికి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. ఈ పని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదని వేలం పైన ప్రశ్నించారు.
రాజకీయ భిక్ష పెట్టడం, పదవులు ఇచ్చి ప్రోత్సహించడం తప్ప తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన ద్రోహం ఏమిటని ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం ప్రశ్నించారు.
ఉద్యోగ నియామకాలకు చెందిన 610జీవోను తెచ్చింది ఎన్టీఆరే అన్నారు. అదే కేసీఆర్ ఎదుగుదలకు దోహదం చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అయ్యేలా చేసిందన్నారు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన ఎన్టీఆర్ పేరును శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు తిరిగి పెట్టడం పైన రాద్ధాంతం మానాలన్నారు.
ఎన్టీఆర్ జాతీయస్థాయి నాయకుడన్నారు. రాజీవ్, ఇందిర తప్ప దేశంలో నాయకులే లేరా అని ప్రశ్నించారు. పీవీ నర్సింహా రావు భౌతిక కాయానికి ఏఐసీసీ కార్యాలయంలో అవమానం జరిగినప్పుడు జానా రెడ్డి, జీవన్ రెడ్డిలు ఎందుకు మాట్లాడలేదన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో బానిస సంకళ్లు తెంచిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.