ప్రతిపక్ష నేత జగన్కు ఈ గదియా?: సాక్షి డైలీ ప్రశ్న
హైదరాబాద్: ప్రతిపక్ష నేత అయిన తనకు శాసనసభ ఆవరణలో తనకు కేటాయించిన గది పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందుకు సంబంధించి సాక్షి దినపత్రికలో అచ్చయిన ఓ వార్తాకథనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. జగన్కు కేటాయించిన గది ద్వారాన్ని, పరిసరాలను ఫొటోలు తీసి పత్రికలో ప్రచురించారు.
చెత్తాచెదారంతో భరించలేని కంపు.. అగ్గిపెట్టెలాంటి చీకటి గుహను తలపించే గదిని జగన్కు కేటాయించారని సాక్షి దినపత్రిక విమర్శించింది. ప్రతిపక్ష నేతతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్లకు రెండేసి గదులు కేటాయిస్తునట్లు చెబుతూ ఆంధ్రప్రదేస్ శానససభా సచివాలయ కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు.
అయితే, ప్రతిపక్ష నేత అయిన జగన్కు మాత్రం ఒకే గది కేటాయించారని సాక్షి దినపత్రిక రాసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 67 శానససభా స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకుంది. జగన్కు కేటాయించిన అగ్గిపెట్టెలాంటి గదిలో పట్టుమని పది మంది కూర్చునే స్థలం లేదని వ్యాఖ్యానించింది.

తన పార్టీ శాసనసభ్యులతో జగన్ సమావేశం కావాలంటే మరో చోటును వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించారని అన్నది. ఇదంతా ఒక ఎత్తయితే ఆ గది చుట్టూ ఉన్న పరిసరాలు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. చీకటి గుహను తలపించే ఆ గదిలో ఎటు చూసినా చెత్తాచెదారం ఉందని, పనికిరాని వస్తువులన్నీ అక్కడే పడేసి డంపింగ్ యార్డ్గా మార్చేశారని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది.
ముక్కుపుటాలు అదిరిపోయే విధంగా దుర్వాసన వస్తోందని, శాసనసభ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే వారు నోరు మెదపడం లేదని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications