చంద్రబాబు మోసాలు వెలుగులోకి వస్తాయి: జగన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం కృష్ణా జిల్లా విజయవాడలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి మోసాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని వైయస్ జగన్ అన్నారు.
అబద్దాలతో ప్రజలను మోసం చేసి పదవుల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. నాయకుడంటే మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని జగన్ అన్నారు. ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా మనం మోసం చేశామని చెప్పుకోకూడదని జగన్ పార్టీ నేతలతో పేర్కొన్నారు.
తాము నిజాయితీ, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాలే చేయాలనుకున్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటి లోగా రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. రైతు, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని కోరారు.