పవన్ కళ్యాణ్ను కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. షర్మిల తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను పవన్కు అందించారు. ఈ సందర్భంగా కాబోయే నూతన జంట వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు, ఏపీ పీసీసీ చీఫ్గా నియమితులైన షర్మిలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కాగా, ప్రస్తుతం షర్మిల కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 18న హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్లో జరగనున్న రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం వేడుకకు భారీగా ఏర్పాటు చేస్తున్నారు.
ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది. ఈ క్రమంలో షర్మిల రాజకీయాలకు అతీతంగా పలువురు అన్ని రాజకీయ పార్టీల నేతలను, వ్యాపారవేత్తలను, సినీ ప్రముఖులను కలిసి నిశ్చితార్ధంతోపాటు పెళ్లి, రిసెప్షన్కి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసి వివాహానికి ఆహ్వానించారు షర్మిల. ఆయన గురువారం జరగబోయే ఎంగేజ్మెంట్కు హాజరవుతున్నారని సమాచారం. ఈ వేడుకకు వైఎస్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి హరీశ్ రావు, నారా లోకేష్, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తదితరులను షర్మిల ఆహ్వానించారు. వైఎస్సార్ మరణం తరువాత ఆ కుటుంబలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications