షర్మిల కుమారుడి నిశ్చితార్దానికి సీఎం జగన్, ప్రముఖులు - ఆహ్వాన పత్రిక వైరల్..!!
వైఎస్ షర్మిల. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. షర్మిల తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 18న హైదరాబాద్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధంకు భారీగా ఏర్పట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్ధంతో పాటుగా పెళ్లికి రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్, వివాహ పత్రిక వైరల్ అవుతోంది.
18న ఎంగేజ్ మెంట్: వైఎస్ షర్మిల కుమారుడు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 17న రాజారెడ్డి - అట్లూరి ప్రియ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ నె 18న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం నిశ్చితార్ధంతో పాటుగా వివాహం, ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిపిప్షెన్ ఆహ్వానాలను ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు.

హాజరు కావాలని ఆహ్వానించారు. తన అన్న సీఎం జగన్ ను కలిసి రావాలని కోరారు. ఇందుకు జగన్ అంగీకరించినట్లు స్వయంగా షర్మిల వెల్లడించారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్, వివాహం అనంతరం నిర్వహించే రిసిప్షెన్ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ లో రిసిప్షెన్: ఈ నెల 18న రాజారెడ్డి - ప్రియ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ కు సీఎం జగన్ హాజరవుతారని సమాచారం. వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు.
రాజకీయాలకు అతీతంగా ఈ ఆహ్వానాలను చూడాలని చంద్రబాబుతో భేటీ అనంతరం షర్మిల పేర్కొన్నారు. ఈ ఎంగేజ్ మెంట్ కు లోకేష్ హాజరవుతారని తెలుస్తోంది. అదే విధంగా రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్దంకు వస్తున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖుల రాక: ఇక, ఫిబ్రవరి 17న జోధ్ పూర్ లో రాజారెడ్డి- ప్రియ వివాహం జరగనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసిప్షెన్ ను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. ఈ రిసిప్షెన్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజారెడ్డి - ప్రియ ఎంగేజ్ మెంట్, వివాహ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్ మరణం తరువాత ఆ కుటుంబలో జరుగుతున్న తొలి శుభకార్యం కావటంతో రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక జరగనుంది. ఎన్నికల వేళ కావటంతో రాజకీయంగానూ ఈ వేడుక పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications