వివేకా నాలుగో వర్ధంతి : నాన్న హంతకుల్ని ఎలా వదిలేస్తానన్న సునీత-చంద్రబాబు జస్టిస్ ఫర్ వివేకా ట్వీట్స్
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. దీంతో పాటే ఆయన కుమార్తె సునీత చేస్తున్న న్యాయపోరాటం కూడా రోజురోజుకూ పదునెక్కుతోంది.
కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురై నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వివేకా నాలుగో వర్ధంతి కార్యక్రమాలు పులివెందులలో జరుగుతున్నాయి. వీటిలో పాల్గొంటున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే విపక్ష నేత చంద్రబాబు కూడా వివేకా హత్యపై న్యాయం జరగాలంటూ వరుస ట్వీట్లు చేశారు.

వివేకా నాలుగో వర్ధంతి
ఏపీలో మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి నాలుగేళ్ల క్రితం అంటే 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్య ఎవరు చేశారనే దానిపై సీబీఐ నాలుగేళ్లుగా విచారణ జరుపుతున్నా ఇంకా అసలు హంతకులు తేలలేదు. మరోవైపు తన తండ్రి హంతకుల్ని తేల్చేందుకు ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర స్ధాయిలో న్యాయపోరాటం చేస్తున్నారు. అటు విపక్షాలు కూడా వివేకా హత్య కేసును ఎన్నికలకు ముందు రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఆయన నాలుగో వర్ధంతి వచ్చింది.

దర్యాప్తుపై సునీత కీలక వ్యాఖ్యలు
వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇవాళ స్పందించారు. నాన్నను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని, కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించానని, కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని కూడా తెలుసన్నారు. హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే అన్ని విషయాలు చెప్పానన్నారు. సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారని, కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నను ఎవరు హత్యచేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతానని ప్రశ్నించారు. 30 ఏళ్ల కిందటి గోడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందన్నారు. తప్పుచేసిన వారికి తప్పక శిక్ష పడాలని, విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలన్నారు. తెలియకుండానే ఎంతోమంది సహకరిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు సునీత తెలిపారు.
చంద్రబాబు జస్టిస్ ఫర్ వివేకా ట్వీట్స్
వివేకా వర్ధంతి నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు ట్వీట్లు చేశారు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారని, చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా అని చంద్రబాబు ట్వీట్ చేసారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు...అది ఆ ఇంట జరిగిన కుట్రేనన్నారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి... బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి....ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications