మే16: జగన్ పార్టీలో అంతర్మథనం, పవన్ హవాపై లెక్క
హైదరాబాద్: మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిస్తేజాన్ని కలిగించాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి కంటే భారీగా వెనుకబడి ఉండటంతో పోల్చితే.. నిన్నటి ప్రాదేశిక ఎన్నికల్లో తొలుత టిడిపితో పోటీ పడినట్లుగా కనిపించింది. దీంతో మే 16 ఫలితాలు టిడిపి వైపు ఏకపక్షంగా ఉండవని అందరు భావించారు. కానీ ఆ తర్వాత టిడిపి పుంజుకుంది. జగన్ పార్టీ దాదాపు వెయ్యికి పైగా ఎంపీటీసీ, వందకు పైగా జెడ్పీటీసీలు వెనుకబడి ఉంది.
దీంతో టిడిపి ఆశలు మళ్లీ పుంజుకున్నాయి. దీనికి గోదావరి జిల్లా సెంటిమెంట్ తోడు కూడా టిడిపి వైపుకు ఉంది. దీంతో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తుందా? అనే చర్చ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే చర్చ సాగుతోందట. మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలను చూస్తున్న జగన్ పార్టీ నేతలు, అభ్యర్థులు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే ఉంటాయేమోననే ఆందోళనకు గురవుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో సహజంగానే టిడిపి మెరుగ్గా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పట్టు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటలు సైతం తాజా ఫలితాలతో తారుమారయ్యాయి. జగన్ పార్టీ కూడా అదే భావించింది. అయితే అసెంబ్లీ ఫలితాలకు రెండు రోజుల ముందే వెలువడిన మునిసిపల్, పరిషత్ ఫలితాలతో ఆ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్థానిక ఎన్నికల్లో టిడిపి ఎవరితోనూ పొత్తులు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తేనే రెండు ఎన్నికలలో ప్రజల ఆదరణతో మెజారిటీ సాధించిందని.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా కలసి రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి బలం మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది గాక.. తూర్పు ఎటో గెలుపు ఆ పార్టీదే అన్న అభిప్రాయాన్ని నిజం చేసేలా మునిసిపాలిటీల్లోనూ, పరిషత్ ఎన్నికల్లోనూ టిడిపి హవా కొనసాగింది.
కడప, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కనిపించింది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో బాగా బలంగా ఉంటామనుకున్న జగన్ పార్టీ ఈ ఫలితాలతో కుదేలైంది. సీమలోని అనంతపురం జిల్లా ఫలితాలు గమనిస్తే అక్కడ టిడిపి క్లీన్ స్వీప్ చేయడం.. జగన్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమకు సంస్థాగత నిర్మాణం లేదని.. అందుకే ఈ ఫలితాలను తాము పెద్దగా పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నప్పటికీ... తాజా ఫలితాలపై అంతర్గతంగా చర్చించుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టుగా చెబుతున్నారు.
కేవలం అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి జగన్ సిఎం కావాలనే లక్ష్యంతోనే పార్టీ పని చేసిందని పైకి చెబుతున్నా స్థానిక ఫలితాలపై ఆ పార్టీ నేతలు లోతైన విశ్లేషణ చేసుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కాపులు ఈసారి టిడిపి-బిజెపి కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో ఆ ఓట్లు కూడా ఆ కూటమికే పడి ఉంటాయని అంటున్నారు. దేశమంతా ఉన్న మోడీ ప్రభంజనం కూడా టిడిపికి తోడైతే జగన్ పార్టీ గెలుపు అసాధ్యమని అంటున్నారు.
మరోవైపు టిడిపి మోడీ వేవ్ మీద ఆశపెట్టుకుని బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్లు ఎక్కువగా తమకే పడతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆశిస్తోంది. అలాగే.. స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకుండా, పూర్తిస్థాయిలో అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించి జగన్ను సిఎం చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులన్నీ పనిచేసినందున ప్రస్తుత ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వారు లెక్కలు వేసుకుంటున్నారు.
టిడిపిలాగా ఆఖరు క్షణందాకా సస్పెన్స్లో పెట్టకుండా పార్టీ అభ్యర్థులందరినీ ముందే ప్రకటించడం వల్ల నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు వారికి తగినంత సమయం దొరికిందని, ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడం నచ్చని టిడిపి శ్రేణులు వలస నేతలకు సహకరించకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విశ్లేషణలు జరుగుతున్నాయట.
వైయస్ జగన్
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిస్తేజాన్ని కలిగించాయి. ఆ పార్టీ మే 16 పైన లెక్కలు వేసుకుంటోంది.
లెక్కింపు
సీమాంధ్రలో పరిషత్ ఎన్నికల ఫలితాల్లో సైకిల్ స్పష్టమైన ఆధిక్యత చాటుకుంది. నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం ప్రభంజనానికి వైయస్సార్ కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.
లెక్కింపు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా పరిషత్లను తెదేపా కైవశం చేసుకుంది.
లెక్కింపు
పురపాలక సంఘాల ఎన్నికల్లో చతికిలబడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిషత్ ఎన్నికల్లో ఒకింత తేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో తెదేపాతో నువ్వా, నేనా అన్నట్టు తలపడి రెండోస్థానంలో నిలిచింది.
లెక్కింపు
జిల్లాల వారీగా విశ్లేషిస్తే రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెదేపా ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
లెక్కింపు
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టిడిపి సైకిల్ వేగం ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలువలేకపోయింది.
లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే రెండోస్థానంతో సంతృప్తిపడింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తెదేపాకు అండగా నిలబడ్డాయి.
లెక్కింపు
పరిషత్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విజయం దరిదాపుల్లోకి రానివ్వకుండా నిలువరించింది.
లెక్కింపు
గోదావరి జిల్లాల్లో పాగా వేయడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ రెండు జిల్లాల్లో జగన్ పార్టీ నిలదొక్కుకుని ఉంటే ఫలితాలు తారుమారయ్యేవి.
లెక్కింపు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తెదేపాకు అనుకూలంగా గ్రామసీమలు ఓటెత్తినట్టు ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే, ఈ రెండు జిల్లాల్లోనూ వైకాపా తెదేపాకు గట్టి పోటీ ఇచ్చింది.
లెక్కింపు
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సొంత గ్రామంలో ఎంపీటిసి స్థానాన్ని, ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేట ఎంపిపి స్థానాన్ని తెదేపా కైవశం చేసుకుంది.
లెక్కింపు
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కొండ్రు మురళి సొంత గ్రామాల్లో ఎంపిటిసి స్థానాల్లో తెదేపా గెలిచింది. మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి జెడ్పీలో తెదేపా గెలవడం విశేషం.