కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
ఏపీలో వైసీపీ (YSRCP) అధికారం కోల్పోయి, కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపు రాష్ట్రంలో కూటమి బలంగా ఉందా లేక వైసీపీ కోలుకుందా, విఫలమవుతోందా ఇలా ఎన్నో ప్రశ్నలు ఓటర్ల మనసుల్లో ఉన్నాయి. అయితే వీటికి ఎవరూ కచ్చితంగా సమాధానం చెప్పే పరిస్ధితి లేదు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా ఈ ప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పే పరిస్దితుల్లో లేవు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసేలా కనిపిస్తోంది.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఎవరు గెలిస్తే వారే రాష్ట్రంగా బలంగా ఉన్నారని చెప్పుకునేందుకు ఓ అవకాశం పార్టీలకు లభిస్తుంది. అయితే అంతకు మించిన ట్విస్ట్ ఇందులో మరొకటి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలిచారన్నది కాదు మేయర్, ఛైర్మన్ల స్ధానాలకు చాలా కాలం తర్వాత ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలన్న కూటమి సర్కార్ నిర్ణయమే ఆ ట్విస్ట్. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో మెజార్టీ మేయర్లు, ఛైర్మన్లను గెలిపించుకుందామనేది కూటమి ఆలోచన. దీని వెనుక కారణం ప్రభుత్వం చుట్టూ చేరిన కోటరీ, సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్టులే. అంతా బావుందంటూ వీరు ఇస్తున్న రిపోర్టుల కారణంగానే ప్రభుత్వం ఇలా హైరిస్క్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే గతాన్ని ఓసారి గమనిస్తే ఈ ప్రత్యక్ష ఎన్నికల వల్ల జరిగే లాభనష్టాలు ఓసారి మనకు అర్దమవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2000 సంవత్సరాలలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే 1994, 1999 శాసన సభ ఎన్నికలలో టీడీపీ గెలిచి జోరు మీద ఉంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా బలహీనపడింది.
1995 ఎన్నికల్లో 294 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ దక్కించుకుంది 26 సీట్లే. మిగతావన్నీ టీడీపీ కూటమికే. ఆ తర్వాత ఏడాదిలోనే ప్రత్యక్ష విధానంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. అయితే ఆ తర్వాత కేంద్రంలో పరిణామాలు కలిసొచ్చి 1999 సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీ కూటమి గెలిచింది. కానీ మరోసారి ఏడాది తర్వాత నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ కోలుకుంది. అంటే ప్రత్యక్ష ఎన్నికలు టీడీపీ కంటే ఎంతో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ను బతికించాయి.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ పరిస్ధితి కూడా దాదాపు అలాగే ఉంది. రెండున్నరేళ్ల క్రితం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఆ తర్వాత ఎంత పుంజుకుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమలు చేయడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీకి తిరిగి కోలుకునే అవకాశం ఇస్తోంది. దీంతో వైసీపీని కేవలం 11 సీట్ల పార్టీగానే చూస్తున్న జనానికి, రేపు కాస్తో కూస్తే ఓట్లు, సీట్లు వస్తే మాత్రం పుంజుకున్నట్లే లెక్కించడం మొదలుపెడతారు. అప్పుడు టీడీపీ 1999 ఎన్నికల తరహాలో కోలుకుంటుందా లేక 2004 ఎన్నికల తరహాలో 2029లోనూ ఓటమి పాలవుతుందా అనేది చూడాల్సి ఉంది.














Click it and Unblock the Notifications