ప్రశాంత్ కిషోర్ తో వైసీపీ ఇక దూరం..!! ఈ నిర్ణయం వెనుక - ఢిల్లీ కేంద్రంగా : ఎఫెక్ట్ పడేనా..!!
వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో దూరంగా ఉండాలని నిర్ణయించింది. 2017 నుంచి వైసీపీ అధినేత జగన్ తో సన్నిహితుగా ఉంటూ..2019 ఎన్నికల్లో జగన్ విజయం కోసం ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్లీనరీ వేదిక నుంచి ప్రశాంత్ కిషోర్ ను జగన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేసారు.
వైసీపీ కోసం పని చేస్తున్నారని వెల్లడించారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు..టిక్కెట్ల కేటాయింపులోనూ ప్రశాంత్ టీం కీలక సూచనలు చేసింది. ఇక, 2024 ఎన్నికల దిశగా సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్న సమయలో ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది.

పీకే అంశంపై సజ్జల కీలక వ్యాఖ్యలు
దీని పైన పార్టీ ముఖ్య నేతల సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. తాము ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవడం లేదని ప్రకటించారు. సీఎం జగన్ తో ప్రశాంత్ కిషోర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూనే.. థర్డ్ పార్టీ సేవలను మాత్రం వినియోగించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థ ద్వారా రాజకీయంగా సర్వేలు.. కావాల్సిన అంశాల పైన నివేదికలు..క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన నివేదికలు అందిస్తున్నారు.
ఏ రాజకీయ పార్టీకి అయినా ఇదే సంస్థ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. అయితే, వైసీపీ తాము ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవటం లేదని ప్రత్యేకంగా చెప్పటం వెనుక కారణాల పైన ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా కాకుండా..ఇప్పుడు పూర్తిగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తో జాతీయ స్థాయిలో రాజకీయ అడుగులు వేస్తున్నారు.

అటు కాంగ్రెస్..ఇటు టీఆర్ఎస్ తో
అదే సమయంలో గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోసం పని చేయాలని నిర్ణయించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పని చేయటం ఖరారైంది. ఈ విషయాన్ని ఈ రోజు పార్టీ ప్లనరీ వేదికగా మరొసారి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, తెలంగాణలో వైఎస్సార్టీపీ కోసం షర్మిళకు సహకారం అందిస్తానని ప్రశాంత్ కిషోర్ మాట ఇచ్చారంటూ స్వయంగా షర్మిల గతం లోనే వెల్లడించారు.
ఇక, బీజేపీ వ్యతిరేక నినాదంతో ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగినా..తాను కాంగ్రెస్ లో చేరటం లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. కానీ, కాంగ్రెస్ కు సలహదారుగా ఉంటానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవాలంటే ఏం చేయాలనే అంశం పైన ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.

సీఎం జగన్ ఆచితూచి అడుగులు
ఆ సందర్భంలో ఏపీలో వైసీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు. ఇది వైసీపీ ముఖ్య నేతలకు రుచించ లేదు. అదే విధంగా.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ - టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తున్న సమయంలో తాము ఆయన సేవలను వినియోగించుకుంటే రాజకీయంగా ఎదురయ్యే విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని..ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేస్తూ..బీజేపీకి ఇప్పటికిప్పుడు దూరం అయ్యేందుకు సీఎం జగన్ సిద్దంగా లేదరనేది మరో అభిప్రాయం. ఏపీలో ఆర్దిక పరిస్థితులు.. కేంద్రం నుంచి మద్దతు అవసరమైన సమయంలో రాజకీయంగా ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉందని... పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం.

నేటి సమావేశంలో సీఎం జగన్ క్లారిటీ
అయితే, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు 2019 ఎన్నికల్లో అనూహ్య విజయానికి వైసీపీకి తోడ్పాటు అందించాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోమని చెప్పటం ద్వారా..పార్టీ పైన ఆ ప్రభావం ఉంటుందా..లేదా అనే చర్చ సైతం మొదలైంది. కానీ, థర్డ్ పార్టీ సేవలు వినియోగించుకుంటామని చెప్పటం ద్వారా..ఐ ప్యాక్ రాజకీయ సేవలను మాత్రం కొనసాగించేందుకు వైసీసీ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజాగా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీకే సేవలను వినియోగించుకోవడం లేదంటూ వైసీపీ ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఈ రోజు జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications