వైసీపీ నేత,వ్యాపార దిగ్గజం బొమ్మన రాజ్కుమార్ కన్నుమూత... చిరకాల వాంఛ తీరకుండానే..
వైసీపీ నేత,వస్త్ర వ్యాపార దిగ్గజం బొమ్మన రాజ్కుమార్(62) హైదరాబాద్లో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన... ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(సెప్టెంబర్ 1) తుది శ్వాస విడిచారు. రాజ్కుమార్ మరణంతో రాజమండ్రిలోని వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. బొమ్మన మృతికి సంతాపంగా బుధవారం రాజమండ్రిలో వ్యాపార సంస్థలను స్వచ్చందంగా మూసివేయనున్నారు. బొమ్మన అంత్యక్రియలు ఆయన స్వగ్రామం దోసకాయలపల్లిలో జరగనున్నాయి.

20 ఏళ్లకే వ్యాపార రంగంలోకి...
దివంగత వస్త్ర వ్యాపారి బొమ్మన రామచంద్రరావు కుమారుడైన బొమ్మన రాజ్కుమార్కు భార్య,ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరూ వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. 20 సంవత్సరాల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన బొమ్మన... అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన... వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

పలు కీలక బాధ్యతల్లో...
2001 నుంచి నిరంతరాయంగా 19 ఏళ్ల సుదీర్ఘ కాలం ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టీకి జీవిత కాల సభ్యుడిగా ఉన్నారు. అలాగే యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ కన్వీనర్గానూ పనిచేశారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్గా కూడా ఉన్నారు. వైసీపీ తరుపున రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు.

చిరకాల వాంఛ తీరకుండానే...
వ్యాపార రంగంలో రాణించిన బొమ్మన రాజ్కుమార్కు రాజకీయాల్లోనూ రాణించాలన్న కోరిక ఉండేది. ఒకప్పుడు తన తండ్రి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం... వ్యాపార రంగంలో తన పోటీదారు చందన రమేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో... తాను కూడా ఎమ్మెల్యేగా చేయాలన్న కోరిక రాజ్కుమార్లో బలంగా ఉండేది. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. మధ్యలో టీడీపీలో చేరి తిరిగి వైసీపీ గూటికే వచ్చారు. అయితే తన చిరకాల వాంఛ తీరకుండానే ఆయన కన్నుమూయడం కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులను ఆవేదనకు గురిచేస్తోంది.
Recommended Video

ప్రముఖుల సంతాపం
బొమ్మన రాజ్కుమార్ మృతి పట్ల ఎంపీ మార్గాని భరత్రామ్ స్థానిక వైసీపీ నేతలు సంతాపం ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని వ్యాపార సంస్థలు నేడు స్వచ్చంద బంద్కు పిలుపునిచ్చాయి. కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనాతో చనిపోయిన నేపథ్యంలో స్థానిక అధికారులు ఎక్కువమందిని అంత్యక్రియలకు అనుమతించకపోవచ్చు.












Click it and Unblock the Notifications