మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..!
ఇవాళ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు తనపై సీఎం చంద్రబాబు (chandrababu) చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ (buggana rajendranath) భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి స్ధాయిలో మీకు రెవెన్యూ విభాగం పట్ల ఉన్న అవగాహన ఇంతేనా? అని ప్రశ్నించారు. మీరు నిర్వహించిన సభలో ఒక పిటీషన్ దారుడు తాను రెండేళ్ళుగా పదుల సార్లు అధికార్ల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదన్నాడంటే అది వ్యక్తిగత సమస్య అని అర్ధం కాలేదా? ఇది ఇద్దరు అన్నదమ్ముల సమస్య కాబట్టే ఏ అధికారి కూడా దానిని పరిష్కరించలేకపోయారని బుగ్గన వివరణ ఇచ్చారు.
మీకు సంబంధిత వ్యక్తికి న్యాయం చేయడం కావాలా ? లేక ప్రతిపక్షం మీద అభియోగం మోపడం కావాలా ? మీ ఉద్దేశమేంటి ? అని చంద్రబాబును బుగ్గన ప్రశ్నించారు. న్యాయం కావాలంటే కలెక్టర్ గారికి ఇచ్చి నిజనిజాలు నిర్ధారణ చేయమని ఆదేశించాలని సూచించారు. మీ వయసుకు, మీ స్ధాయిలో ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. నిజనిర్ధారణ చేయమనండి ఎవరికి ఎలాంటి సమస్యా లేదన్నారు. వందేళ్ళ క్రితం నుంచి తాము ఏ ఇంట్లో ఉన్నామో ఈ రోజు కూడా అదే ఇంట్లో ఉన్నామని బుగ్గన గుర్తుచేశారు.

తనకు, తన అనుచరులకు ఇతరుల ఆస్తుల మీద ఎలాంటి ఆపేక్ష లేదని, పైగా తనకు ఉన్న ఆస్తుల్లో 75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర తమ కుటుంబానిదని బుగ్గన తెలిపారు. మేం దానం చేసిన ఆస్తులు చూడాలంటే ఒక రోజు పడుతుందన్నారు. మీరు సమయం, వీలు చూసుకుని రండి నేనే వ్యక్తిగతంగా వచ్చి చూపిస్తా అన్నారు. వందేళ్ళ క్రితం మీరు ఎక్కడ ఉన్నారో, మీ అనుచరులు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా, కానీ తాను ఈ రోజుకూ తన గురించి చెప్పగలనన్నారు. ఇవాళ సభలో మీ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆర్డీవో ఈ భూమి వ్యవహరం అసైన్డ్ భూమి, పిటీషన్ దారునికి సంబంధం లేదన్నారు. కానీ మీరు ఆయన మాటలను బుల్డోజ్ చేశారని చంద్రబాబుకు బుగ్గన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications