సాయిరెడ్డిపై వైసీపీ ఫస్ట్ రియాక్షన్..! వ్యవసాయం కాదు, చంద్రబాబుకు సాయం..!
నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. జగన్ కోటరీని వదిలించుకుంటేనే భవిష్యత్తు అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనూ అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, జగన్ కు సన్నిహితుడుగా పేరున్న మాజీ మంత్రి ఒకరు సాయిరెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయిరెడ్డినే అన్నారు. ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉంటారన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

సాయిరెడ్డిని మించిన కోటరీ వ్యక్తి ఎవరూ లేరని, తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల సాయిరెడ్డి ఉన్నారని చెప్తే అప్పుడు తాము వెళ్లే వాళ్లం కాదని, మాట్లాడే వాళ్లం కాదన్నారు. కోటరీలో వ్యక్తులు తనను లోపలికి రానివ్వడం లేదని సాయిరెడ్డి చెప్పడాన్ని తప్పుబట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. సాయిరెడ్డి వ్యవహారం, ఆయన మాటలు వింతగా ఉన్నాయన్నారు.

రాజ్యసభ పదవి తీసుకుని, ఆ తర్వాత కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ రాజకీయాలు వదిలేస్తున్నట్లు చెప్పిన సాయిరెడ్డి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అనుమానాలు తలెత్తుతున్నాయని కాకాణి వ్యాఖ్యానించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనేమో అన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని కాకాణి వెల్లడించారు.












Click it and Unblock the Notifications