జైల్లో వంశీకి షాకులు- నేల మీదే నిద్ర- ములాఖత్ తర్వాత పేర్ని షాకింగ్..!
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు తర్వాత విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అరెస్టు తర్వాత జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఇవాళ ఆరోపించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి ఇవాళ ములాఖత్ లో ఆయన్ను కలిసిన పేర్ని నాని జైల్లో పరిస్ధితిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
విజయవాడ సబ్ జైల్లో వంశీని నేల మీదే పడుకోబెడుతున్నారని పేర్ని నాని వెల్లడించారు. ఆయనకు వెన్ను నొప్పి ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఎత్తైన అరుగు ఉంటే దానిపై పడుకునే అవకాశం ఇమ్మని అడుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వంశీ విషయంలో పటమట పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్ని ఆరోపించారు.

మరోవైపు జైల్లో తనకు మంచంతో పాటు ఇంటి భోజనం అనుమతించాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరుగుతోంది. వంశీ ఆరోగ్య పరిస్ధితిపై రిపోర్ట్ ఇవ్వాలని నిన్న పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రిపోర్టు వస్తే కానీ వంశీ విషయంలో న్యాయమూర్తి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే వంశీని ప్రస్తుతానికి జైల్లో ప్రత్యేక గదిలో మాత్రం ఉంచుతున్నారు. మిగతా గదుల్లో తీవ్ర నేరాలు చేసిన నేరస్తులు ఉండటంతో ఇలా ప్రత్యేక గది కేటాయించినట్లు పోలీసులు నిన్న కోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications