మార్గదర్శిపై సీఐడీ యూటర్న్-చంద్రబాబు ముసుగు తీసేశారన్న వైసీపీ ..!
రామోజీ గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్స్ అక్రమాల విషయంలో గత ప్రభుత్వంలో దూకుడు ప్రదర్శించిన సీఐడీ.. తాజాగా ప్రభుత్వం మారడంతో తమ స్టాండ్ మార్చేసుకుంది. అప్పట్లో మార్గదర్శి అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఐడీ.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఆధారాలు లేవని తెలంగాణ కోర్టులో చెప్పేసింది. దీనిపై వైసీపీ మండిపడింది. చంద్రబాబు ముసుగు తీసేసారంటూ వ్యాఖ్యానించింది.
మార్గదర్శి కోసం ఇంత దిగజారుతారా బాబూ? అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు. దొంగలను కాపాడేందుకు అధికార దుర్వినియోగం చేయడమేంటని నిలదీశారు. సీఐడీతో పొరపాటు చేశామని చెప్పించడం ఎంత ఘోరం అని సుధాకర్ బాబు విమర్శించారు. సీఐడీ విశ్వసనీయతను సీఎం దారుణంగా దెబ్బ తీశారని ఆరోపించారు. చంద్రబాబు, ఈనాడు పొలిటికల్ క్విడ్ ప్రొ కో కు పాల్పడ్డారన్నారు. వీరు ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు పని చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు మేలు చేస్తానని అధికారంలోకి చంద్రబాబు నిస్సిగ్గుగా అక్రమార్కులకు అండగా నిలబడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులో రామోజీ కుటుంబాన్ని కాపాడటం కోసం సీఐడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు, వారి కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేసిన డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి, అక్రమార్కులకు అండగా నిలవడం సిగ్గుచేటని సుధాకర్బాబు అన్నారు.
మార్గదర్శి చిట్ఫండ్లో మోసాలు జరిగాయని, చందాదారులకు అన్యాయం జరిగిందని, వారు కట్టిన చందాలు అక్రమ మార్గంలో రామోజీ సంస్థలకు పెట్టుబడుల రూపంలో మళ్లించారని 2023లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసిందని, కానీ చంద్రబాబు సీఎం అయ్యాక అదే సీఐడీ అవేవీ జరగలేదని, తమ వైపు పొరపాటు జరిగిందని, మార్గదర్శికి క్లీన్చిట్ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వాలు మారిన వెంటనే నేరాలు మాఫీ అయిపోతున్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది.












Click it and Unblock the Notifications