జగన్ టూర్ ఎఫెక్ట్..! వైసీపీ నేతలకు మొదలైన షాకులు..!
నిన్న కృష్ణాజిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, గూడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు మాత్రం కేవలం 10 వాహనాలు, 500 మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులతో పలుచోట్ల వైసీపీ నేతలు వాగ్వాదాలకు దిగారు.
కృష్ణాజిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘించరాదని పోలీసులు పలు చోట్ల పోస్టర్లు కూడా అతికించారు. ఎక్కడికక్కడ భారీగా జనం రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎలాగోలా వైఎస్ జగన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగానే జగన్ టూర్ ముగిసింది. కానీ పోలీసులు మాత్రం ఆంక్షల ఉల్లంఘన, ఇతర కారణాలతో వైసీపీ నేతలకు షాకులిస్తున్నారు.

ఇందులో భాగంగా పామర్రు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, ఇతర నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని వీరిపై కేసులు నమోదయ్యాయి. విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడిముక్కల పోలీసులు కేసులు పెట్టారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు కోరినా..పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే అనిల్, ఇతర వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. డ్రోన్ విజువల్స్ ద్వారా గుర్తించి మిగతా వారిపైనా కేసులు పెడతామని కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications