ఇంత భారీ స్కామ్ చరిత్రలో లేదు, బాబు లక్ష్యం అదే : బుగ్గన
హైదరాబాద్ : సింగపూర్ కంపెనీలతో రాజదాని నిర్మాణం పేరిట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారని పీఏసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం జరగలేదన్న బుగ్గన.. ఫ్లాట్ల బిజినెస్ కోసం సింగపూర్ కంపెనీలు అవసరం లేదన్నారు. బాబుకు అమెరికా, ఫారిన్ లలో తిరగాలన్న పిచ్చి బాగా పట్టుకుందని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బుగ్గన ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలపై దుమ్మెత్తి పోశారు.
రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం వాటిని చౌకధరలకే సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా.. కేవలం రూ.300కోట్లు ఖర్చు చేసే సింగపూర్ కంపెనీలకు 58శాతం వాటా అప్పజెప్పి, రూ.15వేల కోట్లు ఖర్చు పెడుతోన్న ప్రభుత్వం 48శాతం వాటాకే పరిమితమవడం హాస్యాస్పదంగా ఉందన్నారు బుగ్గన.

చంద్రబాబు వైఖరి భారతీయ కంపెనీలను అవమానపరిచేలా ఉందని మండిపడ్డ బుగ్గన..
రాజధాని నిర్మాణం పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోని సింగపూర్ కు వేలకోట్ల లబ్డి చేకూర్చుతారా అని బుగ్గన ప్రశ్నించారు. ఇక్కడున్నోళ్లంతా గాడిదలు, విదేశీయులు గుర్రాల్లా కనిపిస్తున్నారా అంటూ చంద్రబాబును నిలదీశారు. ఇదే సందర్బంగా.. అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ భారతీయ కంపెనీలను గాడిదలతో, విదేశీ కంపెనీలతో గుర్రాలతో పోల్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. భారతీయుల పట్ల ఎందుకింత చులకనగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం అనుసరిస్తోన్న స్విస్ చాలెంజ్ విధానాన్ని హైకోర్టు తప్పుబట్టడంతోనే.. ప్రభుత్వం అందులో సవరణలు చేసే పనిలో పడిందని బుగ్గన అన్నారు. చట్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని, నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన బుగ్గన.. నిబంధనల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. చంద్రబాబు గందరగోళానికి ఉద్యోగులు కూడా పనిచేయలేని పరిస్థితి నెలకొందని, సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణాన్ని కట్టబెట్టడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు బుగ్గన.












Click it and Unblock the Notifications