టీడీపీ కార్యకర్తల దాడి: ఆసుపత్రి పాలైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిగ్గింగ్ ను అడ్డుకున్నారనే ఆగ్రహంతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబును అపహరించారు. కొన్ని గంటల పాటు ఆయనను కారులో తిప్పారు. తీవ్రంగా కొట్టారు. టీడీపీ కార్యకర్తలు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. తల, శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఎస్ బాబుపై దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐరాల మండలం కట్టకిందపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఎంఎస్ బాబు తన కుమారుడితో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు. రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రిగ్గింగ్ చేశారని అనుమానిస్తున్న ఈవీఎంను బాబు నేలకు విసిరేశారు. దాన్ని పగులగొట్టారు. దీనితో ఆగ్రహానికి గురైనటీడీపీ నాయకులు, కార్యకర్తలు బాబుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు.

వేరే కారులో ఆయనను, కుమారుడిని ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. రెండు గంటల తరువాత ఆయనను విడిచిపెట్టారు. దాడిలో గాయపడ్డ బాబును వేరే వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదనపు బలగాలను మోహరింపజేశారు. బాబుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications