'దెబ్బకొట్టారు': ఈశ్వరి తలొగ్గుతారా?.. అదే జరిగితే జగన్కు దెబ్బే..
వైసీపీ బుజ్జగింపులకు ఈశ్వరి తలొగ్గుతారా?.. లేక టీడీపీలో చేరడానికే నిర్ణయించుకుంటారా?
హైదరాబాద్: పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త చేరికలను ఆహ్వానిస్తున్న జగన్.. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం పార్టీకి పెద్ద దెబ్బలా పరిణమించింది. గిడ్డి ఈశ్వరి రూపంలో ఆ పార్టీకి ఇప్పుడు గట్టి షాక్ తగలనుంది.
రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్కు షాకిచ్చేనా?
పార్టీ కోసం అహర్నిషలు శ్రమించినవాళ్ల అభిప్రాయాలను కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించకపోవడం ఆమెను తీవ్రంగా కలత చెందేలా చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీని బలమైన పార్టీగా తీర్చిదిద్దితే తనకిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆమె చిన్నబుచ్చుకున్నారు. ఇక రేపో.. మాపో.. ఆమె టీడీపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈశ్వరి ఏమన్నారు?:
'మూడేళ్లు పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించాను.. పాడేరుతో పాటు అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టాను. కానీ నా పట్ల వైసీపీ అధిష్ఠానం అవలంబిస్తున్న వైఖరి తీవ్ర ఆవేదన కలిగించింది. నా ఆత్మవిశ్వాసంపై జగన్, విజయసాయిరెడ్డి దెబ్బకొట్టారు..' అంటూ గిడ్డి ఈశ్వరి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
వైసీపీ శిబిరంలో అలజడి:
గిడ్డి ఈశ్వరి వైఖరితో వైసీపీ శిబిరంలో కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఓవైపు పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ.. ఈశ్వరి పార్టీని వీడితే అది వైసీపీకి మరింత నష్టాన్ని చేకూరుస్తుంది. మున్ముందు పార్టీ నుంచి వలసలు పెరగడానికి ఇది దారితీసే అవకాశం లేకపోలేదు. దీంతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు ఇప్పటికే ఆమెను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.
ఇదీ కారణం:
వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గిడ్డి ఈశ్వరికి మింగుడుపడటం లేదు. అరకు అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో ఫల్గుణకు వైసీపీ తరుపున టికెట్ ఇప్పించాలని ఈశ్వరి భావిస్తుంటే.. ఇంతలో మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబును పార్టీలో చేర్చుకోవడం ఆమెకు నచ్చలేదు. అధిష్టానం తనకు వ్యతిరేక వ్యవహరిస్తోందని భావిస్తున్న ఈశ్వరి పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జగన్ను నమ్ముకుంటే.. ఇలానా?:
తన రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ముఖ్య నేతలతో ఈశ్వరి భేటీ అయినట్టు తెలుస్తోంది. గతంలోనే టీడీపీలో చేరాల్సిందిగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, జగన్ను నమ్ముకుని ఉన్నానని, అయితే తన ప్రమేయం లేకుండా ఏజెన్సీ వైసీపీలోకి ఇతరులను ఆహ్వానించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఈశ్వరి వారితో వాపోయినట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు 'తల నరుకతాం' అని:
ఈ నెల 27న గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో చంద్రబాబు 'తల నరుకుతాం' అంటూ వ్యాఖ్యలు చేసిన గిడ్డి ఈశ్వరి.. ఇప్పుడాయన సమక్షంలోనే పార్టీలో చేరడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో ఎంతటి శత్రుత్వం అయినా ఎన్నో రోజులు నిలబడదు గనుక.. ఈశ్వరి పార్టీ మార్పుకు అవేవి అడ్డు రాకపోవచ్చు. చూడాలి మరి వైసీపీ బుజ్జగింపులకు ఈశ్వరి తలొగ్గుతారా?.. లేక టీడీపీలో చేరడానికే నిర్ణయించుకుంటారా?