టీడీపీ మంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ: బాబు బెదిరింపులకు భయపడేది లేదన్న రోజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. గురువారం చిత్తూరు జిల్లా సత్యవేడు సబ్ జైలులో ఉన్న వైసీపీ లీడర్ కేజే కుమార్ను పార్టీకి చెందిన నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, నారాయణ స్వామి పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తోందని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఏపీలో సీఎం చంద్రబాబు పాలనను సాగిస్తున్నారని ఆమె అన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ
నెల్లూరు జిల్లాలో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జిల్లాలోని టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సమావేశమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీ అనే ఆటోడ్రైవర్ వైద్య సాయం చేయాలని కోరేందుకే తాను టీడీపీ నేతలు కలిసినట్లు ఆయన చెప్పారు.
మంత్రి నారాయణ, సోమిరెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పిన ఆయన ఓ బాధితుడి వైద్య సాయం కోసం కలిశానని చెప్పుకొచ్చారు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 10 లక్షలు విడుదలయ్యేలా చూస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చినట్లు కోటంరెడ్డి తెలిపారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications