జగన్ నిర్ణయంపై స్పందించిన ఎంపీ మోపిదేవి-కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ కు ఇంతకాలం వీర విధేయులుగా పేరు తెచ్చుకున్న వారిని సైతం అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా పక్కన బెట్టేయడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. దీంతో ఆయా నేతల అనుచరులు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ ఇన్ ఛార్జ్ లను మార్చిన నియోజకవర్గాల్లో ఒకటైన బాపట్ల జిల్లా రేపల్లెలోనూ ఎంపీ మోపిదేవి వర్గీయులు నిరసనలకు దిగుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన మత్సకార సంఘాలు మోపిదేవికి ఈసారి ఎట్టి పరిస్దితుల్లోనూ టికెట్ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం ఇచ్చాయి. దీనిపై సీఎం జగన్ తో మాట్లాడతానని వారికి సజ్జల హామీ ఇచ్చి పంపారు. అయితే ఇప్పుడు తాజాగా మోపిదేవితో అధిష్టానం ఫోన్ లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. రేపల్లెలో ఇన్ ఛార్జ్ మార్పు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై మోపిదేవి ప్రెస్ మీట్ పెట్టారు.

ఇందులో మాట్లాడిన వైసీపీ ఎంపీ మోపిదేవి అధిష్టాన నిర్ణయానికి తాను, తన కార్యకర్తలు కట్టుబడి ఉంటామని తెలిపారు.
తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాని స్వాగతిస్తామన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తాను పార్టీ మారతానంటూ కొన్ని టీవీ చానల్స్ లో వస్తున్న వార్తలు నిజం కాదని, వేరే నిర్ణయాలకి తావులేదని మోపిదేవి వెల్లడించారు. తాను అంత క్రమశిక్షణ లేని వ్యక్తిని కాదన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి గ్రాఫ్ సరిగ్గా లేనప్పుడు కాకుండా కొన్ని ప్రత్యేక కారణాల వలన కూడా అధిష్టానం అభ్యర్థిని మారుస్తారంటూ మోపిదేవి వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ కొన్ని కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం సహజమన్నారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని మోపిదేవి తెలిపారు. అధిష్టానం అభ్యర్థనైతే సూచిస్తుందో ఆ అభ్యర్థికి నా పూర్తి మద్దతిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీని అధికారంలోకి రావడానికి కష్టపడి పని చేస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications