ఢిల్లీలో విజయసాయి రెడ్డికి మరో కీలక హోదా - ప్రధాని మోదీకి థ్యాంక్స్..!!
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యుడు వీ విజయసాయి రెడ్డికి మరో అరుదైన అవకాశం లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారాయన.
దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు విజయసాయి రెడ్డి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు స్టాండింగ్ కమిటీలకూ ఛైర్మన్గానూ ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ టూరిజం అండ్ కల్చర్కు ఛైర్మన్గా ఉంటోన్నారు.
ఇటీవలే రాజ్యసభ వైస్ ఛైర్మన్గా కూడా విజయసాయి రెడ్డి ఎంపికైనప్పటికీ- చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ మార్పులు చేసిన అనంతరం ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాను సభలో ప్రకటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వందనా చవాన్, విజయసాయి రెడ్డి, ఇందుబాల గోస్వామి పేర్లను తొలగించారు.
అస్సాంకు చెందిన భువనేశ్వర్ కలిఠా, కర్ణాటక నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ లంకప్ప హనుమంతయ్య, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ సభ్యుడు సుస్మిత్ పాత్రోను కొనసాగించారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్ వైస్ ఛైర్మన్ల జాబితాలో ఉన్నారు.
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించిన అతి కొద్ది రోజుల్లోనే విజయసాయి రెడ్డికి కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యత్వం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజా పద్దుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే కమిటీలో ఆయనకు చోటు దక్కడానికి ప్రధాన కారణం- వృత్తిరీత్యా ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్ కావడమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.