సొంత ఎంపీతోనే కాలేదు ? ఇక విదేశీయా ? చంద్రబాబుకు సాయిరెడ్డి ప్రశ్న !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ ముదురుతోంది. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు పార్టీల నేతలు నిత్యం పరస్పర విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో ఇప్పుడు అమర రాజా బ్యాటరీస్ సంస్ధ తెలంగాణకు వలసపోయిన వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిరాదరణతోనే అమరరాజా తెలంగాణకు వలసపోయిందని టీడీపీ అనుకూల మీడియాసంస్ధలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై పరిశ్రమల మంత్రి అమర్నాథ్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు.
ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్ధ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణలో కొత్తగా 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లడంపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో చంద్రబాబు తాజాగా చేసిన ఓ వ్యాఖ్యను జత చేశారు. తద్వారా చంద్రబాబు సమర్ధతను సాయిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు తన సొంత ఎంపీకి చెందిన సంస్ధతో ఏపీలో పెట్టుబడులు పెట్టించలేకపోయారని, అటువంటిది విదేశీ పెట్టుబడులు తెస్తానని చెప్పుకుంటున్నారని సాయిరెడ్డి ట్వీట్ లో ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ రూ.9500 కోట్ల పెట్టుబడులు పెట్టడం టీడీపీ అవకాశవాదానికి నిదర్శనమని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే ఉద్దేశవూర్వకంగానే టీడీపీ వైసీపీ అధికారంలో ఉన్న ఏపీని కాదని తెలంగాణలో పెట్టుబడులు పెట్టిస్తోందనే అర్ధం వచ్చేలా సాయిరెడ్డి ట్వీట్ ఉంది.