చంద్రబాబు వ్యతిరేక శక్తుల ఏకీకరణకు పావులు కదుపుతున్న వైసీపి
చంద్రబాబు వ్యతిరేక శక్తులకోసం వైసీపి వేట మొదలు పెట్టింది. అందుకోసం ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి దేశమంతా వెతుకుతున్నారు. చంద్రబాబు వ్యతిరేక గళం వినిపించే చేపల కోసం ఆయన గాలం పట్టుకొని మరీ తిరుగుతున్నారు. బీజేపీకి దగ్గర కావడానికి ప్రధాని మంత్రి కార్యాలయం వద్ద కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మోదీని మచ్చిక చేసుకోవడానికి, అమిత్ షా ను ఆకట్టుకోవడానికి, కాషాయ వాదులను కౌగిలించుకోవడానికి విజయసాయి రెడ్డి ఆత్రంగా ఉన్నారు. అంతే కాకుండా మొన్న ముద్రగడ, నిన్న పోసాని, నేడు మోత్కుపల్లితో దూషణల క్రీడకు పచ్చ జెండా ఊపింది వైసీపి. అంతిమంగా చంద్రబాబును 2019లో ఎన్నికల మైదానం నుండి పంపించాలను వ్యూహ రచన చేస్తోంది వైయస్ఆర్ సీపి.

చంద్రబాబు వ్యతిరేక శక్తులకోసం వైసీపి వెతుకులాట..
రాజకీయాల్లో ఆత్మవంచన చాలా సహజంగా చూస్తుంటాం. నిజానికి చాలా మంది రాజకీయ నాయకులకు ఆత్మ ఉండదేమో అనిపిస్తుంది. విలువలతో రాజకీయాలు చేసే వారిని చాలా అరుదుగానే కనిపిస్తుంటారు. ఫిరాయింపు పాలిటిక్స్ ఊపందుకున్న తర్వాత ఎథిక్స్ కు విలువే లేకుండా పోయింది. అమ్మకాలు,కొనుగోళ్లు, అధికార దాహం, ఎలాగైనా అందలం ఎక్కాలన్న ఆశే రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు దిగజారిన రాజకీయం సర్వసాధారణంగా మారింది. ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఏ స్థాయికైనా వెళ్లడానికి మన లీడర్లు వెనకాడటం లేదు. ఫిరాయింపుల్లో మునిగి తేలుతున్న తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరీ ఎబ్బెట్టుగా తయారైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పతాక స్థాయిలో దిగజారిపోతున్నాయి. అధికారం కోసం ఎంత వరకైనా అన్నట్లుగా నాయకులు ప్రవర్తిస్తున్నారు.

ఏపిలో చంద్రబాబును ఒంటరిని చేసి దెబ్బకొట్టాలనేది వైసిపీ వ్యూహం..
2019సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పంతంతో అన్నింటిని మరిచిపోయి వ్యవహారం చేస్తున్నారు. జగన్ ను దెబ్బతీయాలని చంద్రబాబు, ఎలాగైనా చంద్రబాబును మట్టికరిపించాలని జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ఆధిపత్యపోరు ఈ స్థాయికి వెళ్లిందో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చూస్తే సరిపోతుంది. ఎన్నికలు మరో యేడాది మాత్రమే ఉండటంతో వీరిద్దరి మధ్య పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఇరు పార్టీల నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దొరికిన ప్రతి దాన్ని తమకనుకూలంగా మలుచుకోవడానికి నాయకులు ఆరాటపడుతున్నారు. ఇందులో భాగమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ని కలవడం.
ఒక రకంగా ఇది అసాధారణ కలయిక. నిన్న,మొన్నటి వరకు ఉప్పు,నిప్పుగా ఉన్న ఈ నాయకులు చంద్రబాబు అనే ఒక కామన్ పాయింట్ దగ్గర ఒకటైపోయారు. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలను వీరిద్దరు కలిపేశారు. రాజకీయం దగ్గర తెలంగాణ, ఆంధ్రా అనే తేడా ఏమీ లేదని వీరు నిరూపించారు.

మోత్కుపల్లి మంటకు పెట్రోల్ అందిస్తున్న వైసిపీ..
విజయసాయిరెడ్డికి మోత్కుపల్లి మాంచి లడ్డులా కనిపించారు. చంద్రబాబును చితక్కొడుతున్న నర్సింహులు ఆయనకు తెగ నచ్చేశాడు. టీడీపీ అధినేతను తూర్పారపడుతున్న దళిత నేతను వరంలా భావించాడు విజయసాయిరెడ్డి. అందుకే ఆయన ఇంటికి వెళ్లి మాట, ముచ్చట కలిపాడు. ఎపీ లో టీడీపీకి మంట పెట్టేందుకు అగ్గికి ఆజ్యంలా మోత్కుపల్లిని ఉపయోగించుకోవాలన్నది విజయసాయిరెడ్డి ఆలోచన. చంద్రబాబుపైన గొంతు వరకు కోపంగా ఉన్న మోత్కుపల్లికి సహజంగానే ఈ ఆఫర్ నచ్చుతుంది. అయితే విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కలయిక ఎంత వరకు నైతికమనే ప్రశ్న ఉద్భవిస్తోంది. వీరిద్దరు ఒక రాష్ట్రానికి చెందిన నాయకులు కారు. ఇద్దరి రాజకీయ ఎజెండా వేరు. మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబుపైన కోపం ఉండొచ్చు.
కాని ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రం చంద్రబాబుతో ముడిపడి లేదు. ఇక ముందు ఆయన పోరాటంలో టీడీపీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మోత్కుపల్లి విజయం సాధించాల్సింది తెలుగుదేశం పార్టీపైన ఎంత మాత్రం కాదు. ఆయన రాజకీయ శత్రువు వేరు. అలాంటప్పుడు చంద్రబాబుపైన ఆయన ఫోకస్ పెట్టడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. కాని తన కోపం చల్లార్చుకునేందుకు ఆయన ఇంకొన్ని రోజులు టీడీపీ అధినేతను టార్గెట్ చేయవచ్చు.

మోత్కుపల్లి వాఖ్యలకు ఏపిలో అంత తొందరగా విశ్వసనీయత వచ్చే అవకాశాలు లేవు..
అయితే చంద్రబాబు కోసమే ఆంధ్రప్రదేశ్ వెళ్లి అక్కడి రాజకీయాల్లో వేలు పెడితే మోత్కుపల్లికి వచ్చేది ఆయాసం తప్ప మరొకటి లేదు. నిజానికి తెలుగుదేశం నుంచి నర్సింహులును ఎవరూ పంపించలేదు. మితి మీరి చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయన టీడీపీ నుంంచి బహిష్కరణకు గురయ్యారు. అందుకే తెలుగుదేశంలో మోత్కుపల్లికి ఎలాంటి మద్దతు దక్కలేదు. చివరకు కార్యకర్తల సానుభూతి కూడా ఆయనకు లేకుండా పోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా రాజకీయ ఆశ్రయం పొంది భవిష్యత్తును వెతుక్కుంటే నర్సింహులు ఉపయోగం. అలాకుండా వైసీపీ రాజకీయ వ్యూహాంలో చిక్కుకుంటే ఎటుకాకుండా పోయే అవకాశముంది. మరో వైపు విజయసాయిరెడ్డి కి కూడా మోత్కుపల్లి లాంటి నాయకులను వెంటపెట్టుకొని తిరిగితే వచ్చే ఉపయోగం కూడా పెద్దగా లేదు. దళిత నేతకు చంద్రబాబునాయుడు అన్యాయం చేశారన్న సీన్ క్రియేట్ అవుతుందని వైసీపీ ఆశపడుతోంది. కాని రాష్ట్రాలుగా విడిపోయి రాజకీయ ప్రాధాన్యతలు మారిన తర్వాత నర్సింహులు మాటను ఆంధ్రా ప్రజలు పెద్దగా పట్టించుకునే సూచనలు లేవు. మోత్కుపల్లిని రాజకీయ కోణంలో మాత్రమే చూసే అవకాశముంది. అందుకే విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి కలయిక రెండు మూడు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications