దానిపై స్పీకర్ నిర్ణయం, అశాంతికి వైసీపీ ప్లాన్: అసెంబ్లీలో టిడిపి వ్యూహమిదే
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోకముందే కోర్టులకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ అంశాన్ని సాకుగా చూపి శాసనసభ
Recommended Video
అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోకముందే కోర్టులకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ అంశాన్ని సాకుగా చూపి శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని భావించడం సరికాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ తీరును చంద్రబాబునాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి సమన్వయకమిటీ సమావేశం బుదవారం నాడు అమరావతిలో జరిగింది.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ అంశాలపై టిడిపి చర్చించింది. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించాలని నిర్ణయంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో
పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. అయితే అక్కడ కేసును డిస్మిస్ చేస్తే సుప్రీం కోర్టుకు వెళ్లారని చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఈ కేసును సుప్రీం కోర్టు మిగిలిన పిటిషన్లతో కలిపి రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే దీన్ని సాకుగా చూపి సభా బహిష్కరణ చేస్తున్నామనడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబునాయుడు.
అశాంతిని సృష్టించేందుకు వైసీపీ కుట్ర
రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేందుకు తుని ఘటన తరహా కుట్రలు జరిగేందుకు అవకాశముందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికి వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తారని, ఏమైనా చేస్తారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ నేతల గురించి ఎక్కువ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు హితవు పలికారు. ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తున్నామో ప్రచారం చేయాలని బాబు సూచించారు.
3 ఏళ్ళలో అభివృద్దిలో ఏపీ
రాష్ట్రం అప్పులు రూ.2 లక్షల కోట్లకు చేరాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 52 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 47 శాతం ఆదాయం వచ్చేలా విభజన జరిగిందన్నారు. తొలి పది నెలల్లోనే రూ.16 వేల కోట్ల లోటు వచ్చిందన్నారు. ఏపీలో పట్టణ జనాభా తక్కువ ఉంటుందన్నారు. దరిమిలా కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుందన్నారు. అందుకే ఆదాయం కూడ తక్కువగానే ఉంటుందన్నారు. ఉన్న వనరులతోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మూడేళ్లలో మంచి ప్రగతి సాధించినట్టు చెప్పారు.13 వేల కి.మీ. సిమెంటు రోడ్లు వేశామన్నారు. . సాగునీటి ప్రాజెక్టులపై రూ.44 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆస్తుల కల్పనపై చేసే ఖర్చును అప్పుగా చూడకూడదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాభివృద్దిని అడ్డుకొనేందుకు వైసీపీ ప్లాన్
ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కట్టబెడితే దానిని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలను చూశానని చెప్పారు.. కానీ గత మూడేళ్లలో వైసీపీ మాదిరిగా ఏ పార్టీ అసెంబ్లీ ప్రతిష్ఠ దిగజార్చలేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.