ఎంఏ పొలిటికల్ సైన్స్ లో ysrcp ప్రశ్న!
ఆంధ్రా విశ్వవిద్యాలయం అధికారులు నిర్వహించిన ఎంఏ పొలిటికల్ సైన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలో 4(బి) కింద వైఎస్సార్ సీపీ విధానాలు, కార్యక్రమాల గురించి వివరించండి అని ఉండటంతో విద్యార్థులంతా అవాక్కయ్యారు. సబ్జెక్టుకు సంబంధంలేని ప్రశ్న అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్ కాబట్టి వైసీపీ రాజకీయ పార్టీ అని ఉండొచ్చు. కానీ ఏకంగా ప్రభుత్వ విధానాల గురించి ప్రశ్న అడగడంతో తెలుగుదేశం, జనసేన నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. భారతీయ జనతాపార్టీ నేత వై.సత్యకుమార్ ట్వీట్ చేశారు.
పిచ్చి పీక్స్ కు వెళ్లడం అంటే ఇదే!
— Y. Satya Kumar (సత్యకుమార్) (@satyakumar_y) November 5, 2022
ఎం.ఏ.పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో వైఎసార్సీపి పార్టీ విధానాలు కార్యక్రమాల గురించి ప్రశ్న.
సమాధానం ఏమైతే బాగుంటుంది?
పీజీ విద్యార్థులకు ఫీ-రీఇంబర్స్మెంట్ రద్దు చేసారనా?
బీసీ ఎస్సి సబ్ ప్లాన్ నిధుల్నీ బొక్కసానికి దారి మళ్లించారనా?
ఇంకా …🤔 pic.twitter.com/nLwzN1HhRX
పిచ్చి పీక్స్ కు వెళ్లడం అంటే ఇదేనని, ఎం.ఏ.పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో వైఎసార్సీపి పార్టీ విధానాలు కార్యక్రమాల గురించి ప్రశ్న అడిగారని, సమాధానం ఏమైతే బాగుంటుంది? పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఫీ-రీఇంబర్స్మెంట్ రద్దు చేశారనా? లేదంటే బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్నీ బొక్కసానికి దారి మళ్లించారనా?.. అంటూ ట్విటర్ లో రాశారు. ఈ ట్వీట్ కు సత్యకుమార్ ప్రశ్నాపత్రాన్ని కూడా జోడించారు.
రాజకీయాలకు అతీతంగా విద్యా బోధన జరగాల్సిన విశ్వవిద్యాలయాల్లో రాజకీయం తిష్టవేసిందని, ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకు సబబని కృష్ణా జిల్లా జనసేన నాయకులు ప్రశ్నించారు. అధికార పార్టీ విధివిధానాలపై ప్రశ్న రూపొందించిన ప్రొఫెసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యాలయాల్లో తిష్టవేసిన రాజకీయాన్ని బయటకు పంపించి మెరుగైన విద్యాబోధనకు శ్రీకారం చుట్టాలని కోరారు.