ఎగ్ పఫ్ వివాదం: వివరణ ఇచ్చిన వైసీపీ
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన ఎగ్ పఫ్ వివాదం దుమారం రేపుతోంది. వైఎస్ జగన్ హయాంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ పఫ్లను తినడానికి అయిదు సంవత్సరాల కాలంలో 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తలు ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారనీ, దీనికోసం సంవత్సరానికి 18 లక్షల రూపాయలను ఖర్చు చేశారని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తోన్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ ఖర్చును తిరిగి వసూలు చేస్తామనీ చెబుతున్నారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు సైతం దీనిపై కథనాలు ప్రచురితం చేశాయి.

ఈ వివాదంపై వైఎస్ఆర్సీపీ ఘాటుగా స్పందించింది. ఇది వాస్తవం కాదని వివరణ ఇచ్చింది. అబద్ధాలతో ఈ కథనాలను వండివార్చారని పేర్కొంది. జాతీయ మీడియా సైతం ఎగ్ పఫ్ వివాదంపై కథనాలను రాయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీ.
ఎలాంటి ఆధారాలూ లేని పుకార్లను కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని, అందులో వాస్తవం ఎంత అనే విషయాన్ని పార్టీ వర్గాల నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల అభ్యంతరం తెలిపింది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని జాతీయ మీడియా జర్నలిస్టులు ఎలా ట్వీట్ చేయగలుగుతారని ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారాన్ని వార్తలుగా మలచడం.. జర్నలిజానికి మాయని మచ్చగా అభివర్ణించింది వైఎస్ఆర్సీపీ. సెన్సేషనలిజం కోసం వార్తలు రాయడం నిజానికి, జర్నలిజానికి అపచారం చేసినట్టవుతుందని పేర్కొంది. నిజాలను వార్తలుగా రాయాలని, మసిపూసి మారేడుకాయ చేసిన సమాచారాన్ని కాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications