ఇక్కడ రాజకీయ వేడి రాజేసి..అక్కడ చల్లగా ఎంజాయ్ చేస్తోన్న రఘురామ: సొంత నియోజకవర్గానికి దూరంగా
అమరావతి: రఘురామ కృష్ణంరాజు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా పేరు తెచ్చుకున్న లోక్సభ సభ్యుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి. వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడని నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటిపైనా విమర్శలు గుప్పిస్తూ రాజకీయ వేడిని రగిల్చడంలో దిట్ట.
పేరుకే అధికార పార్టీ ఎంపీ..
అధికారం పార్టీకి చెందిన ఏంపీ అయినప్పటికీ- ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా వ్యవహరిస్తుంటారని చెబుతుంటారు. దీన్ని బలపరిచే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన మీడియా, ప్రతికాధిపతులకు రఘురామ కృష్ణంరాజు చాలా ఇష్టుడనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. జైలులో గడిపిన సమయంలో రఘురామ కృష్ణంరాజుకు మద్దతుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు.
బీజేపీ పెద్దలతో..
బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. వంటి శక్తిమంతులైన నేతలను తరచూ కలుసుకునే స్థాయిలో ఆయనకు ఢిల్లీలో పలుకుబడి ఉందని చెబుతుంటారు. ఆస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సీబీఐ న్యాయస్థానం జారీ చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేయడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ప్రతి అడుగుపైనా..
జగన్ సర్కార్ వేస్తోన్న ప్రతి అడుగుపైనా రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో విమర్శలను సంధిస్తుంటారు. ఆరోపణలను గుప్పిస్తుంటారు. చురకలు అంటిస్తుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సినిమా టికెట్ల ఆన్లైన్ వ్యవహారంపైనా రఘురామ కృష్ణంరాజు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వైఎస్ జగన్ అనాలోచితంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనివల్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందనీ స్పష్టం చేశారు.
గుల్మార్గ్లో ఎంజాయ్..
తనను ఫినిష్ చేయడానికీ కుట్ర పన్నారంటూ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర అలజడిని సృష్టించాయి. ఈ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రగిలించే రఘురామ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తోన్నారు. ఈ శీతాకాలంలో ఆయన గుల్మార్గ్లో గడుపుతున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్ వాతావరణంలో ఎంజాయ్ చేస్తోన్నారు. గుల్మార్గ్లోని ఓ రిసార్ట్లో ఉన్నారాయన. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నియోజకవర్గానికి దూరంగా..
రఘురామ కృష్ణంరాజు సొంత లోక్సభ నియోజకవర్గం.. నరసాపురం. చాలాకాలంగా ఆయన తన నియోజకవర్గానికి దూరంగా ఉంటోన్నారు. రెండేళ్లుగా ఆయన నియోజకవర్గానికి రావట్లేదు. ఓ ప్రజా ప్రతినిధి ఇన్ని సంవత్సరాలుగా తనను గెలిపించిన ఓటర్లకు దూరంగా గడపడం కూడా ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఆయనపై పలు కేసులు నమోదు కావడం వల్ల నియోజకవర్గానికి రావట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. స్టుపిడ్ పాలిటిక్స్ కారణంగా తాను నియోజకవర్గానికి దూరంగా ఉన్నానంటూ రఘురామ సైతం అంగీకరించారు.
తిరిగొచ్చి.. కుమ్మేయండి..
ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోపై మిశ్రమ స్పందన లభిస్తోంది. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు తప్పు పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో నియోజకవర్గం ప్రజలను వారి మానాన వారిని వదిలేశారని చెబుతున్నారు. మరికొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు. తిరిగొచ్చి మళ్లీ కుమ్మేయాలని సూచిస్తున్నారు. సమస్యలన్నింటినీ పక్కనపెట్టి బాగా ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.