పవన్ పై తగ్గిన వైసీపీ దూకుడు ? కాపు రాజకీయాల వేళ చర్చ ! వ్యూహాత్మకమేనా!
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని పవన్ ప్రకటించగానే జగన్ కోపం రెట్టింపైంది. అంతే ఇక జగన్ తాను పాల్గొనే ప్రతీ సభలోనూ, కార్యక్రమంలోనూ చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టేశారు. ఆయన్ను చూసి వైసీపీ నేతలు కూడా పవన్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కాపు నాడు భేటీ, రంగా వర్ధంతి నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా వెనక్కితగ్గినట్లు కనిపిస్తోంది.

పవన్ పై జగన్ విమర్శలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత ఏడాది కాలంలో దూకుడు మరింత పెంచారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ నుంచి మొదలుపెట్టి వైసీపీపై పవన్ తన దాడి ముమ్మరం చేశారు. దీంతో పాటు మళ్లీ చంద్రబాబువైపు మొగ్గడం మొదలుపెట్టారు. దీంతో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా సందర్భంతో సంబంధం లేకుండా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కూడా అంతే స్ధాయిలో వీరికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ వర్సెస్ చంద్రబాబు కంటే జగన్ వర్సెస్ పవన్ వారే ఎక్కువయ్యేలా ఉందన్న చర్చ కూడా జరిగింది.

పవన్ పై తగ్గిన వైసీపీ దూకుడు?
అయితే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేసిన వైసీపీ, ప్రధాని పర్యటనలో పవన్ కు దక్కిన ప్రాధాన్యత, రాష్ట్రంలో మారుతున్న రాజకీయం నేపథ్యంలో దూకుడు తగ్గించింది. పవన్ పై నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలకు దిగే పేర్నినాని, కొడాలి, అమర్నాథ్ వంటి నేతలు కూడా కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. మధ్యలో వారాహి వాహనంపై విమర్శలు చేసినా త్వరగానే వాటి నుంచి వెనక్కితగ్గారు. సీఎం జగన్ కూడా సభల్లో పవన్ పై తీవ్ర విమర్శలు చేయడం లేదు. దీనంతటికీ ఓ కీలక కారణం కనిపిస్తోంది.

కాపు రాజకీయంతో వైసీపీ వ్యూహాత్మక మౌనం?
రాష్ట్రంలో ప్రస్తుతం కాపు రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ ఇద్దరూ కాపు నేత వంగవీటి రంగాను స్మరించుకుంటున్నారు. ఆయన కుమారుడు రాధా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం క్లారిటీతో కాపు రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ ను వైసీపీ కానీ, జగన్ కానీ టార్గెట్ చేస్తే సహజంగానే ఈ వ్యతిరేకత వైసీపీపైకి మళ్లే అవకాశాలు లేకపోలేదు. అలాగే జగన్ కు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న రాజకీయంతో సహజంగానే కాపులు సీఎం పదవి డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ విశాఖళో జరిగే కాపునాడు భేటీలోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు కాపులకు ఆశాదీపంగా కనిపిస్తున్న పవన్ పై విమర్శలకు దిగితే ఆ ప్రభావం కచ్చితంగా అధికార పార్టీపై పడటం ఖాయం. అందుకే వైసీపీ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications