Tirupati Assembly Constituency: ఎన్టీఆర్, చిరంజీవి గెలిచిన సీటు- వైసీపీ-టీడీపీ హోరాహోరీ ?
ఏపీలో తిరుపతి లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ సీటు అయిన తిరుపతి కూడా ఒకటి. తిరుపతి అర్బన్, రూరల్ మండలాలతో ఇది ఏర్పడింది. ఇందులో 2.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు పోటీ చేసి గెలిచిన అసెంబ్లీ సీటు ఇది. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువగా ఉన్నా.. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు నడిచే నియోజకవర్గం ఇది.
టీడీపీ ఆవిర్భావానికి ముందు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఆరు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1967లో ఇండిపెండెంట్ అభ్యర్ధి ఈశ్వర్ రెడ్డి గెలిస్తే మిగిలిన ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలుపు వరించింది. 1978లో ఇక్కడి నుంచి గెలిచిన ఈశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు ఉపఎన్నికలు సహా మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓ ఉపఎన్నిక సహా ఐదుసార్లు (1983 , 1994 , 1999 , 2014 , 2015 ఉప ఎన్నిక ) టీడీపీ గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇక్కడ గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

తిరుపతి అసెంబ్లీ సీటులో కాంగ్రెస్ మూడుసార్లు (1985, 1989, 2004 )గెలిచింది. 2009లో పీఆర్బీ అధినేత చిరంజీవి తొలిసారి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో 2012లో వచ్చిన ఉపఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచింది. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మృతితో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నిక్లలో వైసీపీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు.
కులాలవారీగా చూస్తే 8 సార్లు రెడ్లు , 7 సార్లు బలిజలు , ఒకసారి కమ్మ అభ్యర్ధి తిరుపతి అసెంబ్లీ సీటులో గెలిచారు. 1983లో గెలిచిన ఎన్టీఆర్ ని కమ్మగా , 2009లో గెలిచిన చిరంజీవిని కాపు అభ్యర్ధులుగా చెప్పలేం. తాజాగా మారిన పరిస్ధితుల్లో 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి కమ్మ, బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.












Click it and Unblock the Notifications