చంద్రబాబు బావకే రుణమాఫీ కాలేదని, సభ నుంచి జగన్ వాకౌట్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా.. బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. రుణమాఫీ పైన అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిల మధ్య మాటల యుద్ధం నడిచింది. రుణమాఫీపై మంత్రి సమాధానానికి నిరసనగా వైసిపి వాకౌట్ చేసింది.
అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో.. రుణమాఫీపై జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బావకే రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై దారుణంగా అబద్దాలు ఆడుతోందన్నారు.
మీ మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టడం ఆపేశారన్నారు. ఇప్పుడు అప్పులు తీరక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీవీ చూసినా, ఏ గోడ చూసినా, ఫ్లెక్సీ చూసినా రుణమాఫీ హామీలు కనిపించాయని, ఇప్పుడు ఏం జరిగిందన్నారు.

రాష్ట్రంలో 87వేల కోట్లకు పైగా రైతు రుణాలున్నాయని, అప్పుడు ఎన్నికల్లో ఇవన్నీ మాఫీ చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రైతులు అపరాధ వడ్డీ కట్టలేక కష్టాలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు రెండేళ్లు కలిపి ఇచ్చిన రూ.7400 కోట్లు ఎటూ సరిపోలేదన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారని, స్వయంగా చంద్రబాబు బావకే రుణమాఫీ జరగలేదన్నారు.
జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఆగ్రహం చేశారు. రుణమాఫీ పైన వైసిపికి మాట్లాడే అర్హత లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మంత్రి పుల్లారావు సమాధానంపై వైసిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షం వాకౌట్ చేసింది.
ఓ సమయంలో జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాకౌట్ చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించాలని, దాని మీద సుదీర్ఘంగా మాట్లాడేందుకు వీల్లేదని చెప్పారు. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి, తర్వాత మోసం చేసి, వాళ్ల ఆథ్మహత్యలకు కారణమైనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications