వైసీపీ నేత శివారెడ్డి దారుణ హత్య: టీడీపీ కార్యకర్తల పనేనా?
అనంతపురం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు.
పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. కాగా, మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
శివారెడ్డి హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెప్పారు.