భారత్లో వెలుగుచూసిన తొలి ‘ఈటా’ వేరియంట్: మంగళూరులో వ్యక్తికి గుర్తింపు
మంగళూరు: కరోనావైరస్ మహమ్మారికి సంబంధించి ఇప్పటికే పలు వేరియంట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో కరోనా వేరియంటు వెలుగుచూసింది. కరోనావైరస్ తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, శాస్త్రవేత్తలను ఆందోళనలకు గురిచేస్తోంది. బ్రిటన్లో తొలిసారి గుర్తించిన 'ఈటా'(బీ.1.525) వేరియంట్ ఇప్పుడు భారత్లోనూ వ్యాపిస్తోంది.
కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. ఇతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకున్నారు.

బాధితుడితో సన్నిహితంగా ఉన్న దాదాపు 100 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడిందని వైద్యులు వివరించారు. దేశంలో ఇదే ఈటా వేరియంట్ తొలి కేసు కావడం గమనార్హం.
కాగా, ఈటా వేరియంట్ను గత డిసెంబర్ నెలలో బ్రిటన్ తోపాటు నైజీరియాలో గుర్తించారు. ఈ ఏడాది ఫబ్రవరిలో 24న బ్రిటన్లో 56 కేసులు నమోదయ్యాయి. డెన్మార్క్లోనూ పలు కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి నెలలోనే ఈ వేరియంట్ నైజీరియాలో విస్తృతంగా వ్యాపించినట్లు ఆ దేశ అధికార యంత్రాంగం వెల్లడించింది. మార్చి 5 వరకు ఈటా వేరియంట్ 23 దేశాలకు పాకింది. ఈ వేరియంట్ తీవ్రతను తెలుసుకునేందుకు యూకేలో ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
కర్ణాటకలో కరోనా ఆంక్షలు అమలు
కర్ణాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనవైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కేరళ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం 5 గంటల వరకు విధించనున్నట్లు తెలిపింది. కేరళ, మహారాష్ట్రలకు సరిహద్దుగా ఉన్న ఎనిమిది సరిహద్దు జిల్లాలు బీదర్, కలబూర్గి, బెలగావి, విజయపుర, చమరాజనగర, మైసూరు, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో వీకెండ్ కర్ఫ్యూ విధించనున్నట్లు వెల్లడించింది.
కోవిడ్-19 అడ్వైజరీ కమిటీ, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ మేరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 23 నుంచి 9వ తరగతి నుంచి 12వ తగరతి వరకు క్లాసులను ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ తరగతులు ప్రత్యామ్నాయ రోజుల్లో ఉంటాయని తెలిపారు.
ఒకటి నుంచి 8వ తరగతి వరకు క్లాసులను ప్రారంభించే విషయంపై తర్వాత కరోనావైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని సీఎం బొమ్మై వెల్లడించారు. కాగా, కర్ణాటకలో గురువారం 1785 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 25 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మొత్తం కేసులు 29.13లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 36,705కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 1651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 28,52,368కి చేరింది. బెంగళూరులో గురువారం 414 మంది కరోనా బారినపడ్డారు. 554 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 24,414 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు, పాజిటివిటీ రేటు 1.10 శాతంగా ఉండగా, కేసు మరణాల రేటు(CFR) 1.40 శాతంగా ఉంది. గురువారం నమోదైన 25 మరణాలలో 5 బెంగుళూరు అర్బన్, బెళగావి, దక్షిణ కన్నడ, కోలార్ 3, మాండ్య, మైసూరు, ఉడిపి 2 నుంచి ఉన్నాయి. కొత్త కేసులు నమోదైన జిల్లాల్లో, బెంగళూరు అర్బన్ 414, దక్షిణ కన్నడ 337, ఉడిపి 134, హసన్ 125, మైసూరు 105, కొడగు 100, ఇతర జిల్లాలు ఉన్నాయి. పాజిటివ్ కేసుల జాబితాలో బెంగళూరు అర్బన్ జిల్లా అగ్రస్థానంలో ఉంది, బెంగళూరులో మొత్తం 12,29,340, మైసూరు 1,73,599, తుమకూరు 1,18,136 పాజిటివ్ కేసులున్నాయి.
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మళ్లీ 40 వేలకు పైగా కేసులు నమోదవుతోంది. గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 464 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,26,754 కి చేరింది. ఇదిలాఉంటే.. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కరోనా నుంచి 41,096 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,15,844 కి పెరిగింది. అయితే.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4,14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Recommended Video
కాగా గురువారం నమోదైన కేసుల్లో.. అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 22 వేల కేసులు, మహారాష్ట్రలో 9వేల మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 1.30 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 49,53,27,595 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే కేరళకు వైద్య బృందాన్ని పంపింది కేంద్రం. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రం నుంచే ఉండటం ఆందోళనకరంగా మారింది. దాదాపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన క్రమంలో కేరళలో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications