కాంగ్రెస్లోకి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి- పీసీసీ చీఫ్తో సుదీర్ఘ మంతనాలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్.. కాంగ్రెస్లో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తన శాసన సభ సభ్యత్వానికి ఆదివారమే రాజీనామా చేశారు. సిర్సిలో- అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
మే 10వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జగదీష్ షెట్టార్కు టికెట్ను నిరాకరించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ను మరొకరికి కేటాయించాలని నిర్ణయించింది. యువతకు ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే 67 సంవత్సరాల జగదీష్ షెట్టార్కు టికెట్ ఇవ్వడానికి అధిష్ఠానం అంగీకరించలేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో- షెట్టార్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీకీ గుడ్బై చెప్పారు. స్పీకర్కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం సిర్సిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్లో చేరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని, తన అనుచరులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలనేదే తన తుది నిర్ణయమని వివరించారు.
తనకు టికెట్ కేటాయించట్లేదనే విషయాన్ని కనీసం రెండువారాల కిందట అయినా సూచనప్రాయంగానైనా తెలియజేసి ఉంటే- రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని ఉండేవాడినని షెట్టార్ అన్నారు. టికెట్ ఖరారవుతుందని, ప్రచార కార్యక్రమాలను చూసుకోవాలంటూ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా తనకు సందేశాలు అందాయని చెప్పారు. ఇప్పుడు తనకు టికెట్ ఇవ్వట్లేదని ప్రకటించిందని పేర్కొన్నారు.
పార్టీ అగ్రనాయకత్వం ఉద్దేశపూరకంగానే తనను పక్కన పెట్టిందని భావిస్తోన్నానని, అవమానకర పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే షెట్టార్కు టికెట్ ఇవ్వట్లేదంటూ బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తన కంటే వయసులో పెద్దవారు, 70 ఏళ్లు దాటిన త్రిపా రెడ్డి, దీపేష్ స్వామి, కర్జోర్ సహా పలువురికి ఎలా టికెట్లు ఇచ్చారని నిలదీశారు.
కాగా- బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధం అయ్యారు. సిర్సి నుంచి బెంగళూరుకు చేరుకున్న జగదీష్ షెట్టార్తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలా, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు వారి మధ్య మంతనాలు కొనసాగాయి. అవి ఫలించినట్లు తెలుస్తోంది.
జగదీష్ షెట్టార్కు బీజేపీ ఘోరంగా అవమానించిందంటూ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. వాడుకుని విసిరేసిందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- అమిత్ షా-బసవరాజ్ బొమ్మైలకు ఇది అలవాటైన పనేనని చెప్పారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆరుసార్లు బీజేపీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నాయకుడికి అవమానకరంగా బయటికి పంపిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications