సీక్రేట్ డీల్, మల్లికార్జున ఖార్గేని పర్సనల్ గా కలిసిన డీకేశీ, తమ్ముడితో, సీఎం సీటు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు అవుతున్న సందర్బంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇంటికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పరుగు తీశారు. బెంగళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇంటికి తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ తో కలిసి వెళ్లిన డీకే. శివకుమార్ పెద్దాయనతో చర్చలు జరిపారు.
మల్లికార్జున ఖార్గే, డీకే శివకుమార్ చర్చలు జరిపిన సమయంలో మిగిలిన నాయకులు ఎవ్వరిని ఆ గదిలోకి అనుమతించలేదని తెలిసింది. మల్లికార్జున ఖార్గే, డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే, సురేష్ మాత్రమే చర్చలు జరిపారని తెలిసింది. మల్లికార్జున ఖార్గేతో భేటీ కావడానికి ముందే ఆయన ఇంటి ముందు డీకే శివకుమార్ మీడియతో మాట్లాడారు.

తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లానని, కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తాను కంటినిండా నిద్రపోలేదని డీకే శివకుమార్ అన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తున్నానని, తనను జైలుకు పంపించినా బీజేపీ నాయకుల బెదిరింపులకు ఏమాత్రం తల వంచలేదని డీకే శివకుమార్ అన్నారు.
తనకు సర్వేల మీద నమ్మకం ఉన్నా, లేకపోయినా ఆ విషయం వేరే అని, తన లెక్క ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 141 సీట్లు కచ్చితంగా వస్తాయని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడిని భేటీ అయిన కేపీసీసీ అధ్యక్షుడు తనకు సీఎం పదవి ఇప్పించాలని పెద్దాయనకు మనవి చేశారని తెలిసింది,
అయితే తాను మర్యాదపూర్వకంగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేని కలిశానని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు బెంగళూరులోనే ఉంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇంటికి కాంగ్రెస పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. అయితే క్లైమాక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications