నా ఇంటిని ఎందుకు తగలబెట్టారు?: బెంగళూరు అల్లర్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే
బెంగళూరు: సోషల్ మీడియా పోస్టు వివాదంలో చెలరేగిన హింసలో అల్లరిమూకలు డీజే హళ్లిలోని తన ఇంటిపై దాడితోపాటు విధ్వంసం సృష్టించడంపై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి చేయడానికి వారికి హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
తన ఇంటిపై దాడి జరగడానికి ఐదు నిమిషాల ముందే తన కుటుంబసభ్యులందరూ కృష్ణాష్టమి వేడుకలను వీక్షించేందుకు దేవాలయానికి వెళ్లారని ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి తెలిపారు. దీంతో వాళ్లందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. తప్పు చేస్తే తన మేనల్లుడినైనా, ఎవరినైనా పోలీసులు శిక్షిస్తారని, కానీ.. ఇలా తన ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు.
తన వాహనాలను, ఇంటికి నిప్పుపెట్టి పూర్తిగా విధ్వంసం చేశారని మండిపడ్డారు.
స్పష్టమైన ప్రణాళికతోనే ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. తన నియోజకవర్గంలోని ప్రజలను సోదరుల్లా చూసుకుంటానని, ఎవరికైనా సమస్య ఉంటే తనను సంప్రదించవచ్చని అన్నారు. ఈ సంఘటనపై లోతైన విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం చెలరేగిన హింసాత్మక ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. వందలాది వాహనాలను, ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ పైనా దాడి చేసి వాహనాలకు నిప్పుపెట్టారు. అల్లర్లు హింసాత్మకంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మరణించారు. ఆందోళనకారుల దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయాలపాలయ్యారు. సుమారు వెయ్యి మంది వరకు ఆందోళనకారులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న వాహనాలకు, ఇంటికి నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే ఇంట్లో కూడా విధ్వంసం సృష్టించారు. దీంతో వందమందికిపైగా ఆందోళనకారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications