ఆకాశ్-ఐశ్వర్య లవ్స్టోరీ: మధ్యలో భర్త: 16 ఏళ్ల వయసులో పెళ్లి: మూడేళ్ల తరువాత ప్రియుడితో మళ్లీ
బెంగళూరు: పదహారు సంవత్సరాల వయస్సులో తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా పెద్దలు చేసిన వివాహాన్ని తాజాగా ధిక్కరించిందో యువతి. మూడేళ్ల తరువాత తన ప్రియుడిని పెళ్లాడింది. అతనితో కలిసి అత్తారింటికి వెళ్లిపోయింది. బాల్య వివాహం చేయడం వల్ల చట్టపరంగా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం లేదనీ చెబుతున్నారు. కర్ణాటకలోని బాగల్కోట్లో చోటు చేసుకున్న ఘటన ఇది. స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. మూడేళ్ల తరువాత తన ప్రియురాలికి రెండో భర్తగా ఉండటానికి ఆ యువకుడు అంగీకరించడం గొప్ప విషయమనీ అంటున్నారు.
అప్పటికి ఆమె వయస్సు 15
ఆ యువతి పేరు ఐశ్వర్య. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకన హళ్లి తాలూకా పరిధిలోని మేలనహళ్లి గ్రామానికి చెందిన యువతి. 2016లో స్కూలు తరఫున చిత్రదుర్గ కోట సందర్శనకు వెళ్లారు. అప్పటికి ఆమె వయస్సు 15 సంవత్సరాలు. అక్కడ బాగల్కోట్కు చెందిన ఆకాశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారిద్దరూ తమ సెల్ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
బలవంతంగా పెళ్లి
2017లో ఐశ్వర్యకు ఆమె కుటుంబ పెద్దలు పెళ్లి చేశారు. అప్పటికి ఆమె వయస్సు 16 సంవత్సరాలే. ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ.. కుటుంబ సభ్యుల బలవంతం మీద పెళ్లికి ఒప్పుకొంది. పెళ్లి తరువాత కూడా ఐశ్వర్య.. ఆకాశ్తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించింది. తాను మేజర్ కావడం.. తనను పెళ్లి చేసుకోవడానికి ఆకాశ్ అంగీకరించడంతో ఆమె నేరుగా బాగల్కోట్కు వెళ్లింది. ఆకాశ్ను పెళ్లాడింది. బాగల్కోట్లోని ముచఖండి వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో వారిద్దరు ఒక్కటయ్యారు.
తన రెండో భర్తకు ప్రాణహాని
అనంతరం భర్తతో కలిసి బాగల్కోట్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. మొదటి భర్త తరఫు నుంచి తన, తన రెండో భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య తండ్రి దేవరాజ్, సోదరుడు బాగల్కోట్కు చేరుకున్నారు. రెండో పెళ్లి చేసుకోవద్దంటూ కాళ్లా, వేళ్లా పడ్డారు. అయినప్పటికీ.. ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్గా ఉన్నప్పుడు, ఇష్టం లేని పెళ్లి చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాను మేజర్నని, తన ప్రియుడిని పెళ్లాడే హక్కు ఉందని వాదించారు. ఈ పెళ్లికి చట్టపరంగా ఎలాంటి అభ్యంతరం లేకపోవడం వల్ల తామేమీ చేయలేమని పోలీసులు చెబుతున్నారు.