ఎయిర్టెల్ బాదుడు: రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంపు!
ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్ ఇస్తూ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా ఈ ధరల పెంపును అమలు చేయడంతో రీఛార్జ్ చేసుకునే సమయంలో వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఉన్న పాపులర్ ప్లాన్ల స్థానంలో ఇప్పుడు ఎక్కువ ధరతో కూడిన కొత్త ప్లాన్లు దర్శనమిస్తున్నాయి.
రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంపు
ముఖ్యంగా 84 రోజుల వ్యాలిడిటితో వచ్చే పాపులర్ ప్లాన్పై ఎయిర్ టెల్ ధరను పెంచింది. గతంలో ఈ ప్లాన్ 859 రూపాయలకు లభించగా.. ఇప్పుడు దానిని 899 రూపాయలకు పెంచారు. అంటే వినియోగదారులు అదనంగా 40 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు తక్కువ ధరకు లభించే 799 రూపాయల ప్లాన్ను కంపెనీ పూర్తిగా తొలగించింది. దీని వల్ల సామాన్య వినియోగదారులకు తక్కువ ధరలో లభించే ఆప్షన్లు తగ్గిపోయి భారం పెరిగింది.

ప్రయోజనాలు మారలేదు.. ధర మాత్రమే పెరిగింది..
ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులకు లభించే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు రాలేదు. పెరిగిన ధరతో వచ్చే రూ.899 ప్లాన్లో కూడా మునుపటిలాగే ప్రతిరోజూ 1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు మాత్రమే లభిస్తాయి. వ్యాలిడిటీ కూడా 84 రోజులే ఉంటుంది. అంటే అదే సేవలను పొందేందుకు వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావడం గమనార్హం.
మధ్యతరగతిపై ప్రభావం
ఈ ధరల పెంపు ప్రభావం ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత వినియోగదారులపై ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలా రీఛార్జ్ భారం కాకూడదని 84 రోజుల ప్లాన్ను ఎంచుకునే వారికి ఇది పెద్ద దెబ్బ. టెలికాం నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎయిర్టెల్ అడుగుజాడల్లో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా త్వరలోనే తమ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉంది.
ధరల పెంపుకు కారణాలివే..
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్కరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులు విపరీతంగా పెరగడమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణమని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. కంపెనీల ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగదారులపై ఈ భారాన్ని వేస్తున్నాయి. వెరసి మునుపటి కంటే మెరుగైన సేవలు రాకపోయినా, జేబుకు మాత్రం చిల్లు పడక తప్పని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications