Cheque Bounce: ‘డ్రాయర్’ అంటే ఎవరో తేల్చేసిన సుప్రీంకోర్టు తీర్పు
ఏదైనా ఒక కంపెనీ లేదా సంస్థ తరపున చెక్కులపై సంతకాలు చేసి, చెల్లింపుల బాధ్యతలు చూసే వ్యక్తులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. సంస్థ తరపున చెక్కు ఇచ్చినా.. ఆ చెక్కుపై సంతకం చేసే అధికారం పొందిన వ్యక్తిని చట్టప్రకారం 'డ్రాయర్' (చెక్కు జారీ చేసిన వ్యక్తి)గానే పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్-1881లోని సెక్షన్ 138 కింద చెక్కు బౌన్స్ అయితే, సదరు సంతకం చేసిన అధికారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
కేసు నేపథ్యం ఇదీ..
'టైమ్స్' (TIMES) అనే స్వచ్ఛంద సంస్థ (NGO)కు చెందిన ట్రెజరర్ (కోశాధికారి), సంస్థ కుదుర్చుకున్న ఒక అవగాహనా ఒప్పందం (MoU) ప్రకారం చెక్కులను జారీ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి అధీకృత సంతకందారుగా (Authorized Signatory) వ్యవహరించారు. ఈ క్రమంలో విద్యుత్ పంపిణీ సంస్థ 'APCPDCL' (ప్రస్తుతం తెలంగాణ సీపీడీసీఎల్/TGSPDCL)కు సదరు ఎన్జీవో తరపున చెక్కులు జారీ చేశారు. అయితే, ఆ చెక్కులు బౌన్స్ కావడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.

'నేను కేవలం ఉద్యోగిని' అన్న వాదన తిరస్కరణ
కోర్టు విచారణలో అప్పీలుదారు (ట్రెజరర్) తరపు న్యాయవాదులు విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. గతంలో జరిగిన ఒక కేసు తీర్పును ఉదహరిస్తూ.. తాను కేవలం సంస్థలో ట్రెజరర్గా మాత్రమే పనిచేస్తున్నానని, కేవలం సంతకం చేసే అధికారం ఉన్నంత మాత్రాన చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తిగత బాధ్యత ఉండదని వాదించారు.
అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. సదరు ఎన్జీవో సంస్థ ఈ వ్యక్తిని తన ముఖంగా మార్చి, ఆర్థిక లావాదేవీలపై సంతకాలు చేసే పూర్తి అధికారం కల్పించిందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఈ ఒప్పందం ద్వారా ఉత్పన్నమయ్యే అన్ని చట్టపరమైన పరిణామాలకు, చెక్కు బౌన్స్ పరిణామాలకు ఆ వ్యక్తే పూర్తి బాధ్యత వహించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.
రూ.1.5 కోట్ల జరిమానా.. లేదంటే జైలుకే!
సంస్థలో ట్రెజరర్గా పనిచేస్తున్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పాత శిక్షను కొద్దిగా సవరిస్తూ పాక్షిక అప్పీలుకు అనుమతి ఇచ్చింది. బాధితుడైన తెలంగాణ సీపీడీసీఎల్ (TSSPDCL) సంస్థకు రెండు నెలల గడువులోగా రూ. 1.5 కోట్ల భారీ జరిమానాను చెల్లించాలని సదరు ట్రెజరర్ను ఆదేశించింది.
ఒకవేళ కోర్టు ఇచ్చిన గడువులోగా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో, సదరు అధికారి ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష (జైలు శిక్ష) అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో తీవ్రంగా హెచ్చరించింది. కంపెనీల్లో చెక్కులపై గుడ్డిగా సంతకాలు చేసే అధికారులకు ఈ తీర్పు ఒక కనువిప్పు లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు.














Click it and Unblock the Notifications